తెలంగాణ టీ20(TG20) ప్రీమియర్ లీగ్ ఆరంభానికి ముందే చిక్కుల్లో పడింది. లీగ్ చట్టబద్ధతను సవాల్ చేస్తూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ చెందిన క్రికెటర్లు గౌరవ్ శర్మ, మహేందర్ రెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోయేషన్ ప్రతిపాదించిన ‘టీజీ20 లీగ్’కు ఎలాంటి చట్టబద్ధత లేదని, ప్రస్తుత పాలకవర్గానికి ఈ లీగ్ను నిర్వహించే అధికారం లేదని వారు తమ పిటిషన్లో పేర్కొన్నారు.
పిటిషనర్లు తమ రిట్లో హెచ్సీఏ వివాదాస్పద పదవీకాలంలో జరిగిన నియామకాలు, అనుమతులు, పరిపాలనా నిర్ణయాలు, పాలనా ప్రక్రియలన్నింటిపై న్యాయపరమైన విచారణ జరపాలని కోరారు.
మరోవైపు హెచ్సీఏలోని ఆర్థిక అక్రమాలపై సమగ్ర సీఐడీ దర్యాప్తునకు జస్టిస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది. హెచ్సీఏపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ చేసిన ఫిర్యాదులపై నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేయాలని తెలంగాణ సీఐడీని లోకాయుక్త ఆదేశించింది.
ఈ కేసును 2026 జూలై 24కు వాయిదా వేస్తూ, ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైతే సంబంధిత అధికారులపై తీవ్రమైన క్రమశిక్షణా చర్యలు తప్పవని లోకాయుక్త హెచ్చరించింది.


