హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద "తెలంగాణ క్రికెట్ కోసం ప్రజా ఉద్యమం" పేరుతో నిర్వహించిన ధర్నాలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) నేతలు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)పై పలు ఆరోపణలు చేశారు.
టీసీఏ కార్యదర్శి గురువా రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ జిల్లాల క్రికెటర్లకు హెచ్సీఏలో సరైన అవకాశాలు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రతిభావంతులైన ఆటగాళ్లు హెచ్సీఏ వ్యవస్థ కారణంగా నష్టపోతున్నారని ఆరోపించారు.
ప్రత్యేక తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలు, మండలాల స్థాయిలో ఇతర క్రీడలకు ఉన్నట్లుగా క్రికెట్కు కూడా ప్రత్యేక వ్యవస్థ అవసరమని పేర్కొన్నారు. బీసీసీఐ టోర్నమెంట్లలో ఆడాలంటే హెచ్సీఏ పరిధిలోనే ఉండాల్సిన పరిస్థితి జిల్లాల ఆటగాళ్లకు ఇబ్బందిగా మారిందన్నారు.
హెచ్సీఏలో అవినీతి, అక్రమాలు జరిగాయని, ఎంపికల ప్రక్రియలో పారదర్శకత లేదని టీసీఏ నేతలు ఆరోపించారు. క్లబ్ల నమోదు, ఎన్నికలు, ఆర్థిక వ్యవహారాలు, క్రీడాకారుల ఎంపికలో పలు అక్రమాలు జరిగాయని వారు పేర్కొన్నారు. హెచ్సీఏలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
అలాగే హెచ్సీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లీగ్లకు సంబంధించిన అనుమతులు, క్లబ్ల చట్టబద్ధత, పాలకవర్గ నియామకాలపై కూడా టీసీఏ నేతలు ప్రశ్నలు లేవనెత్తారు. గతంలో సమర్పించిన ఫిర్యాదులపై ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకోవాలని కోరారు.
గ్రామీణ, జిల్లా స్థాయి ఆటగాళ్ల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం జోక్యం చేసుకుని పెండింగ్లో ఉన్న ఫిర్యాదులపై విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


