మహిళల టీ20 ప్రపంచకప్-2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. బుధవారం నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా కీలక స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ గాయపడింది. ఫీల్డింగ్ చేసే క్రమంలో ఆమె కుడి కాలి మడమ తిరగబడింది.
దీంతో తీవ్రమైన నొప్పితో ఆమె విలవిలాడింది. ఫిజియో వెంటనే మైదానంలోకి వచ్చి ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ శ్రేయాంక పాటిల్ కనీసం కాలు కింద పెట్టలేకపోయింది. దీంతో ఆమెను స్ట్రెచర్పై గ్రౌండ్ వెలుపలి తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత స్కానింగ్ కోసం పాటిల్ను అస్పత్రికి తరలించారు.
ఇంకా రిపోర్ట్స్ రావాల్సి ఉంది. అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో శ్రీయాంక ఈ మెగా టోర్నీ నుంచి వైదొలిగే అవకాశముంది. కాగా శ్రీయాంకు గాయాలేమి కొత్త కాదు.
గతంలో వేలి ఫ్రాక్చర్, ఆ తర్వాత గ్రేడ్-3 షిన్ స్ప్లింట్స్ గాయాల కారణంగా శ్రేయాంక దాదాపు 16 నెలల పాటు ఆటకు దూరమైంది. డబ్ల్యూపీఎల్-2026 సీజన్తో ఆమె పునరాగమనం చేసింది. ఆర్సీబీ వరుసగా రెండోసారి ఛాంపియన్గా నిలవడంలో శ్రేయాంకది కీలక పాత్ర. ఇప్పుడు వరల్డ్కప్ వంటి మెగా టోర్నీలో కూడా సత్తాచాటాలని భావించిన శ్రేయాంకకు తీవ్ర నిరాశే ఎదురైంది.
ఇక పాకిస్తాన్, నెదర్లాండ్స్లపై వరుసగా భారీ విజయాలు సాధించిన హర్మన్ సేన గ్రూప్-ఎ టేబుల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్ తమ తదుపరి మ్యాచ్లలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి పటిష్టమైన జట్లను ఎదుర్కోనుంది. ఇలాంటి సమయంలో శ్రేయాంక గాయం మేనేజ్మెంట్కు పెద్ద తలనొప్పిగా మారింది.
చదవండి: ముంబైకి సూర్య గుడ్బై!.. గంభీర్తో కలిసి ఆ జట్టులోకి?!


