గెలిస్తే నిలుస్తారు.. యూఏఈతో అమీతుమీకి సిద్ధమైన శ్రీలంక

T20 WC 2022: Namibia Take On Netherlands, Sri Lanka Take On UAE On Oct 18 - Sakshi

టీ20 వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ రౌండ్‌లో (గ్రూప్‌-ఏ) రేపు (అక్టోబర్‌ 18) అత్యంత కీలక మ్యాచ్‌ జరుగనుంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో నమీబియా చేతిలో ఓడి సూపర్‌-12కు చేరే అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న ఆసియా ఛాంపియన్‌ శ్రీలంక.. రేపు యూఏఈతో అమీతుమీకి సిద్ధమైంది. ఒకవేళ శ్రీలంక ఈ మ్యాచ్‌లోనూ ఓడితే ఇంటిముఖం పట్టాల్సి ఉంటుంది.

కాబట్టి లంకేయులు ఈ మ్యాచ్‌ను చాలా సీరియస్‌గా తీసుకోనున్నారు. ప్రత్యర్ధి యూఏఈని తక్కువ అంచనా వేయకుండా సర్వశక్తులు ఒడ్డేందుకు ప్రయత్నిస్తారు. యూఏఈ సైతం తొలి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చింది. నెదర్లాండ్స్‌తో నువ్వానేనా అన్నట్లు సాగిన లో స్కోరింగ్‌ గేమ్‌లో దాదాపు గెలిచినంత పని చేసింది. శ్రీలంక.. యూఏఈ విషయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. 

గ్రూప్‌-ఏలో రేపు మరో మ్యాచ్‌ జరుగనుంది. టేబుల్‌ టాపర్లుగా ఉన్న నమీబియా, నెదర్లాండ్స్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇరు జట్లు తమ తొలి మ్యాచ్‌ల్లో బలమైన ప్రత్యర్ధులపై గెలిచి ఉత్సాహంగా ఉన్నాయి. నమీబియా.. తమకంటే చాలా మెరుగైన శ్రీలంకకు షాకిస్తే, నెదర్లాండ్స్‌.. ఉత్కంఠ పోరులో యూఏఈని ఖంగుతినిపించి మరో గెలుపు కోసం ఉరకలేస్తుంది. ఈ మ్యాచ్‌ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభంకానుండగా.. శ్రీలంక-యూఏఈ మ్యాచ్‌ ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top