విధ్వంసం సృష్టించిన షా, రహానే, దూబే | Syed Mushtaq Ali Trophy 2024: Mumbai Beat Vidarbha In Quarter Finals | Sakshi
Sakshi News home page

విధ్వంసం సృష్టించిన షా, రహానే, దూబే

Dec 11 2024 5:30 PM | Updated on Dec 11 2024 6:29 PM

Syed Mushtaq Ali Trophy 2024: Mumbai Beat Vidarbha In Quarter Finals

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో ముంబై జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇవాళ (డిసెంబర్‌ 11) జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌-4లో ముంబై విదర్భపై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా సెమీస్‌కు చేరుకుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన విదర్భ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అథర్వ తైడే (66), వాంఖడే (51) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో శుభమ్‌ దూబే (43 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.

అనంతరం బరిలోకి దిగిన ముంబై.. 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్లు పృథ్వీ షా (26 బంతుల్లో 49; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), అజింక్య రహానే (45 బంతుల్లో 84; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించగా.. ఆఖర్లో శివమ్‌ దూబే (22 బంతుల్లో 37 నాటౌట్‌; ఫోర్‌, 2 సిక్సర్లు), సూర్యాంశ్‌ షేడ్గే (12 బంతుల్లో 36 నాటౌట్‌; ఫోర్‌, 4 సిక్సర్లు) బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి విధ్వంసం సృస్టించారు. 

ఈ మ్యాచ్‌లో ముంబై గెలుపుపై ఆశలు వదులుకున్న తరుణంలో శివమ్‌ దూబే, సూర్యాంశ్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడారు. ముంబై విజయానికి  షా, రహానే బీజం వేసినప్పటికీ.. మధ్యలో టీమిండియా స్టార్లు శ్రేయస్‌ అయ్యర్‌ (5), సూర్యకుమార్‌ యాదవ్‌ (9) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.

సూపర్‌ ఫామ్‌లో రహానే
ఈ టోర్నీలో ముంబై కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అజింక్య రహానే సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. రహానే గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 52, 68, 22, 95, 84 పరుగులు స్కోర్‌ చేశాడు. విదర్భతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో రహానే కేవలం 27 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. 

Advertisement
 
Advertisement
Advertisement