source: X
మహిళల ఆసియా కప్-2026లో డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంక అద్భుత విజయంతో తమ ప్రయాణాన్ని ప్రారంభించింది. దుబాయ్ వేదికగా నిన్న జరిగిన మ్యాచ్లో యూఏఈపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బౌలింగ్ చేసిన శ్రీలంక, యూఏఈని కేవలం 79 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం 7.5 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
మహిళల టీ20ల్లో బంతుల పరంగా శ్రీలంకకు ఇదే అతి భారీ విజయం. ఈ మ్యాచ్లో ఆ జట్టు మరో 73 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించి, రికార్డు విజయం నమోదు చేసింది.
37 డాట్ బాల్స్
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన యూఏఈ.. మిథాలీ అయోధ్య (3.5-0-14-3), చేతన విముక్తి (4-0-16-3), సుగంధిక కుమారీ (4-0-18-2), చమారీ ఆటపట్టు (3-0-10-1), కవిష దిల్హరి (2-0-9-1) ధాటికి 19.5 ఓవర్లలో 79 పరుగులకే చాపచుట్టేసింది.
యూఏఈ బ్యాటర్లు శ్రీలంక బౌలింగ్ను ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. తొలి 10 ఓవర్లలో ఏకంగా 37 డాట్ బాల్స్ పడ్డాయంటే పరిస్థితి ఎంత దారుణమో అర్దమవుతుంది.
అరుదైన మైలురాయిని తాకిన లంక కెప్టెన్
స్వల్ప లక్ష్యఛేదనలో శ్రీలంక మెరుపు వేగంతో ప్రారంభించింది. కెప్టెన్ చమారీ ఆటపట్టు 25 బంతుల్లో 48 పరుగులతో (7 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయంగా నిలిచి, తన జట్టును గెలుపు తీరాలకు చేర్చింది. ఈ క్రమంలో చమారీ ఓ అరుదైన మైలురాయిని తాకింది. మహిళల ఆసియా కప్లో సిక్సర్తో 500 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్గా రికార్డు నెలకొల్పింది.
నేడే భారత్ మ్యాచ్
ఈ టోర్నీలో భారత్ ఇవాళ తమ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. దుబాయ్ వేదికగా జరిగే మ్యాచ్లో థాయ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.
చదవండి: నేడు బరిలోకి భారత మహిళలు


