ఆసియా కప్లో థాయ్లాండ్తో పోరు
రాత్రి 8 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్ చానెల్, సోనీ లివ్ యాప్ లో ప్రత్యక్ష ప్రసారం
దుబాయ్: మహిళల ఆసియాకప్ టి20 క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు తొలి మ్యాచ్కు సిద్ధమైంది. గ్రూప్ ‘ఎ’ నుంచి బరిలోకి దిగుతున్న హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా ఆదివారం థాయ్లాండ్తో తలపడనుంది. గతేడాది వన్డే వరల్డ్కప్ నెగ్గిన భారత జట్టు... ఈ ఏడాది టి20 ప్రపంచకప్లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడంలో విఫలమైంది. మెగా టోర్నీలో గ్రూప్ దశలోనే వెనుదిరిగిన టీమిండియా... ఆసియాలో తమకు తిరుగులేదని నిరూపించుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పొట్టి ఫార్మాట్లో రాణించడమే లక్ష్యంగా హర్మన్ బృందం ఈ టోర్నీలో బరిలోకి దిగనుంది. ఇప్పటి వరకు తొమ్మిది సార్లు ఆసియాకప్ జరగగా... అందులో ఏడుసార్లు భారత జట్టు ట్రోఫీ కైవసం చేసుకుంది. మరో రెండు సార్లు ఫైనల్లో ఓడి రన్నరప్గా నిలిచింది.
2012 నుంచి ఈ టోర్నీని టి20 ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి టీమిండియా మూడుసార్లు ట్రోఫీ చేజిక్కించుకుంది. గాయం కారణంగా స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ ఈ టోర్నమెంట్కు దూరం కాగా... ఆమె స్థానంలో జట్టులోకి వచ్చిన ప్రతీకా రావల్ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో చూడాలి. స్మృతి మంధాన, షఫాలీ వర్మ, ప్రతీకా రావల్, హర్మన్ప్రీత్ కౌర్, భారతి, రిచా, దీప్తి శర్మతో భారత బ్యాటింగ్ బలంగానే ఉన్నా... వీరంతా కలిసికట్టుగా కదం తొక్కాల్సిన అవసరముంది.
బౌలింగ్లో ఆంధ్ర అమ్మాయి శ్రీచరణి కీలకం కానుంది. దీప్తి శర్మ, రేణుక సింగ్, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, నందని శర్మ, రాధ యాదవ్, ప్రేమ రావత్ రూపంలో బౌలింగ్లో టీమిండియాకు మంచి ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. ఎటొచ్చి టీమిండియాకు ఫీల్డింగ్ ప్రధాన సమస్యగా మారింది. మరోవైపు టోర్నమెంట్ ఆరంభ మ్యాచ్లో హాంకాంగ్పై విజయం సాధించిన థాయ్లాండ్ జట్టు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది.
శ్రీలంక శుభారంభం
మహిళల ఆసియాకప్లో శ్రీలంక శుభారంభం చేసింది. గ్రూప్ ‘బి’లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక 9 వికెట్ల తేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ని ఓడించింది. మొదట యూఏఈ 19.5 ఓవర్లలో 79 పరుగులకు ఆలౌటైంది. ఇషా ఓజా (18) టాప్ స్కోరర్. లంక బౌలర్లలో మిథాలీ, చేతన చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం శ్రీలంక 7.5 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 80 పరుగులు చేసింది. కెప్టెన్ చమరి ఆటపట్టు (25 బంతుల్లో 48 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్లు) ధనాధన్ షాట్లతో చెలరేగింది.


