విన్నర్స్ ట్రోఫీ బహూకరించేదెవరో?
తెరపైకి మళ్లీ మొహసిన్ నక్వీ సమస్య
ఈనెల 29 నుంచి దుబాయ్లో మహిళల ఆసియా కప్ క్రికెట్ టోర్నీ
న్యూఢిల్లీ: వచ్చే వారం ప్రారంభం కానున్న మహిళల ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు విజేతగా నిలిస్తే మరోసారి... ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చీఫ్, పాకిస్తాన్ హోం మంత్రి మొహసిన్ నక్వీ ఉదంతం తెరపైకి రానుంది. ఈ నెల 28 నుంచి సెప్టెంబర్ 13 వరకు టి20 ఫార్మాట్లో జరగనున్న ఈ టోర్నీకి దుబాయ్ ఆతిథ్యమివ్వనుంది. కాగా... గతేడాది దుబాయ్లోనే జరిగిన పురుషుల ఆసియా కప్ టి20 టోర్నమెంట్లో భారత జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో దాయాది పాకిస్తాన్పై 5 వికెట్ల తేడాతో గెలిచి చాంపియన్గా అవతరించింది. ఈ టోర్నమెంట్లో చిరకాల ప్రత్యర్థి పాక్తో ఎదురుపడ్డ మూడుసార్లు టీమిండియాదే పైచేయి అయింది.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఏసీసీ అధ్యక్షుడైన పాకిస్తాన్ మంత్రి మొహసిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు భారత జట్టు అంగీకరించలేదు. దీంతో ఇతర అధికారులతో ఇప్పించేందుకు బదులు నక్వీ ట్రోఫీని తన కార్యాలయానికి తీసుకెళ్లాడు. ఇప్పటి వరకు ఆ ట్రోఫీని భారత జట్టుకు అప్పగించలేదు. టోర్నమెంట్ అనంతరం కూడా నక్వీ పట్టువీడలేదు. టీమిండియా తన చేతుల మీదుగానే ట్రోఫీ తీసుకోవాలని భీషి్మంచుకున్నాడు. ఐసీసీ సమావేశం సందర్భంగా బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ సమస్యను ముగించేందుకు ప్రయత్నించాడు. ఇరు వర్గాల మధ్య సమస్య తొలగినట్లే అని సైతం వెల్లడించాడు.
అయినప్పటికీ మొహసిన్ నక్వీ మాత్రం ఇప్పటి వరకు ట్రోఫీ అంశంపై స్పష్టతనివ్వలేదు. ఇప్పుడు కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ హోదాలో నక్వీనే ఏసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతుండగా... మహిళల ఆసియా కప్లో సెప్టెంబర్ 5న పాకిస్తాన్తో భారత జట్టు తలపడనుంది. టీమిండియా విజేతగా నిలిస్తే బహుమతి ప్రదానోత్సవం అంశం మరోసారి చర్చనీయాంశం కానుంది. గతేడాది సూర్యకుమార్ యాదవ్ మాదిరిగానే... ఈసారి హర్మన్ప్రీత్ కౌర్ కూడా నక్వీ చేతుల మీదుగా కప్ అందుకునేందుకు నిరాకరిస్తుందా చూడాలి. ఇరు జట్ల మధ్య ‘షేక్ హ్యాండ్’లు, ఆత్మీయ పలకరింపులు ఉండబోవని బోర్డు స్పష్టం చేసింది.


