సెయింట్ లూయిస్ (అమెరికా): కెయిన్స్ కప్ మహిళల అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ను మాజీ చాంపియన్, భారత నంబర్వన్ కోనేరు హంపి ఎనిమిదో స్థానంతో ముగించింది. హంపి ఏడు గేమ్లను ‘డ్రా’ చేసుకొని, రెండింటిలో ఓడిపోయి 3.5 పాయింట్లు సాధించింది. ప్రపంచకప్ విజేత, భారత్కే చెందిన గ్రాండ్మాస్టర్ దివ్య దేశ్ముఖ్ 4.5 పాయింట్లతో ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. దివ్య రెండు గేముల్లో గెలిచి, ఐదు గేమ్లను ‘డ్రా’ చేసుకొని, మరో రెండు గేముల్లో ఓడిపోయింది.
క్యాండిడేట్స్ టోర్నీ విజేత, మహిళల ప్రపంచ చాంపియన్షిప్ చాలెంజర్, భారత గ్రాండ్మాస్టర్ వైశాలికి ఈ టోర్నీ నిరాశను మిగిల్చింది. వైశాలి 2.5 పాయింట్లతో చివరిదైన పదో స్థానాన్ని దక్కించుకుంది. వైశాలి ఐదు గేమ్లను ‘డ్రా’ చేసుకొని, నాలుగు గేముల్లో ఓడిపోయింది. పది మంది ప్లేయర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో చైనా గ్రాండ్మాస్టర్ టాన్ జోంగి 6.5 పాయింట్లతో విజేతగా నిలిచింది. అలైస్ లీ (అమెరికా; 6 పాయింట్లు) రన్నరప్గా నిలువగా... బిబిసారా అసబయేవా (కజకిస్తాన్; 5 పాయింట్లు) మూడో స్థానాన్ని సంపాదించింది.


