తొలిరౌండ్‌లో సింధు ఓటమి | Sindhu lost in the first round | Sakshi
Sakshi News home page

తొలిరౌండ్‌లో సింధు ఓటమి

Oct 9 2024 3:48 AM | Updated on Oct 9 2024 3:48 AM

Sindhu lost in the first round

పారిస్‌ ఒలింపిక్స్‌ తర్వాత పాల్గొన్న తొలి టోర్నమెంట్‌లో భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు తొలి రౌండ్‌లోనే పరాజయం ఎదురైంది. ఫిన్‌లాండ్‌లో మంగళవారం మొదలైన ఆర్క్‌టిక్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నీలో సింధు ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరుకోలేకపోయింది. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 16వ ర్యాంకర్‌ సింధు 16–21, 10–21తో ప్రపంచ 32వ ర్యాంకర్‌ మిచెల్లి లీ (కెనడా) చేతిలో ఓడిపోయింది. 

గతంలో మిచెల్లి లీపై 10 సార్లు గెలిచిన సింధు నాలుగోసారి ఆమె చేతిలో ఓటమి చవిచూసింది. ఇదే టోర్నీలో ఆడుతున్న భారత రైజింగ్‌ స్టార్స్‌ మాళవిక బన్సోద్, ఆకర్షి కశ్యప్‌ తొలి రౌండ్‌లో గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రపంచ 23వ ర్యాంకర్‌ సుంగ్‌ షువో యున్‌ (దక్షిణ కొరియా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 37వ ర్యాంకర్‌ మాళవిక 21–19, 24–22తో నెగ్గగా... ప్రపంచ 39వ ర్యాంకర్‌ వైవోన్‌ లీ (జర్మనీ)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 41వ ర్యాంకర్‌ ఆకర్షి 21–19, 21–14తో విజయం సాధించింది. 

పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత ప్లేయర్‌ కిరణ్‌ జార్జి మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించాడు. క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లో కిరణ్‌ జార్జి 21–16, 13–21, 21–19తో లుకాస్‌ క్లియర్‌»ౌట్‌ (ఫ్రాన్స్‌)పై గెలుపొందాడు.   

Advertisement
 
Advertisement
Advertisement