
2023 CEAT క్రికెట్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిన్న (ఆగస్ట్ 21) దేశ వాణిజ్య రాజధాని ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి క్రికెట్తో పాటు ఇతర రంగాలకు చెందిన చాలామంది సెలెబ్రిటీలు హాజరయ్యారు. ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో (మూడు ఫార్మాట్లలో) అత్యుత్తమ ప్రదర్శన (రేటింగ్స్ ఆధారంగా) కనబర్చిన ఆటగాళ్లను CEAT జ్యూరీ అవార్డులకు ఎంపిక చేసింది.
టీ20 బ్యాటర్ ఆఫ్ ద ఇయర్గా టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఎంపిక కాగా.. టెస్ట్ బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ దక్కించుకున్నాడు. టీమిండియా డాషింగ్ ఓపెనర్ శుభ్మన్ గిల్ వన్డే బ్యాటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో పాటు ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. గిల్కు ఈ రెండు అవార్డులను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అందజేశాడు.
ఈ ఏడాది వన్డేల్లో భీకర ఫామ్లో ఉన్న గిల్.. ఇప్పటివరకు జరిగిన 12 మ్యాచ్ల్లో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 750 పరుగులు చేయగా.. స్కై.. ఈ ఏడాది ఇప్పటివరకు ఆడిన 10 టీ20ల్లో 433 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు టీమిండియా స్టార్లు గతేడాది సైతం ఆయా ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు. ముఖ్యంగా స్కై 2022లో టాప్ టీ20 రన్స్ స్కోరర్గా (187.43 స్ట్రయిక్రేట్తో 46.56 సగటున 1164 పరుగులు) నిలిచాడు. ఇందులో 68 సిక్సర్లు ఉన్నాయి.
CEAT అవార్డులు గెలుచుకున్న ఇతరుల వివరాలు..
- టీ20 బౌలర్ ఆఫ్ ద ఇయర్: భువనేశ్వర్ కుమార్
- ఇన్నోవేటెడ్ కోచ్ ఆఫ్ ద ఇయర్: బ్రెండన్ మెక్కల్లమ్
- వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: దీప్తి శర్మ
సునీల్ గవాస్కర్ చేతుల మీదుగా దీప్తి శర్మ అవార్డును అందుకుంది.