సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లో ఆఖరి రెండు మ్యాచ్లకు గాయం కారణంగా దూరమైన టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్.. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు. దీంతో న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో భారత జట్టును ముందుండి నడిపించేందుకు గిల్ సిద్దంగా ఉన్నాడు. అంతకంటే ముందు విజయ్ హజారే ట్రోఫీ-2025లో గిల్ ఆడనున్నాడు.
టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ మాదిరిగానే కేవలం రెండు మ్యాచ్లకు మాత్రమే గిల్ అందుబాటులో ఉండనున్నాడు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన 18 మంది సభ్యుల జట్టులో గిల్ ముందే చోటు దక్కించుకున్నాడు. అయితే ఈ టోర్నీలో పంజాబ్ ఆడిన తొలి రెండు మ్యాచ్లకు గిల్ దూరంగా ఉన్నాడు.
దీంతో అతడు గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని, నేరుగా కివీస్ సిరీస్లోనే ఆడనున్నాడని వార్తలు వచ్చాయి. కానీ గిల్ మాత్రం ఈ దేశవాళీ వన్డేలో టోర్నీలో ఆడేందుకు సిద్దమయ్యాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. జనవరి 3న సిక్కిం, జనవరి 6న గోవాతో పంజాబ్ ఆడనున్న మ్యాచ్లలో గిల్ బరిలోకి దిగనున్నాడు.
ప్రస్తుతం మొహాలీలో ఉన్న శుభ్మన్.. జనవరి 1న జైపూర్లో పంజాబ్ జట్టుతో కలవనున్నట్లు సమాచారం. అదేవిధంగా ముంబైతో జరిగే ఫైనల్ గ్రూపు లీగ్ మ్యాచ్ ఆడేందుకు కూడా గిల్ ఆసక్తిచూపుతున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. జనవరి 8న పంజాబ్ తమ చివరి లీగ్ మ్యాచ్లో ముంబైతో తలపడనుంది.
అయితే అక్కడికి రెండు రోజుల తర్వాత భారత్-న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్ క్యాంపును ఏర్పాటు చేసే అవకాశముంది. ఒకవేళ అదే జరిగితే ముంబైతో మ్యాచ్కు గిల్ దూరం కానున్నాడు. కాగా గిల్ ప్రస్తుతం పేలవ ఫామ్తో సతమతవుతున్నాడు. దీంతో అతడికి టీ20 వరల్డ్కప్-2026 జట్టులో చోటు దక్కలేదు. అతడి స్ధానంలో ఇషాన్ కిషన్ను జట్టులోకి తీసుకున్నారు.
చదవండి: రికెల్టన్ సుడిగాలి శతకం వృథా.. మార్క్రమ్ మెరుపులతో బోణీ


