టీ20 ప్రపంచకప్-2026కు ముందు న్యూజిలాండ్తో జరిగిన ఆఖరి పోరు(ఐదో టీ20)లో టీమిండియా సత్తాచాటింది. తిరువనంతపురం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో కివీస్ను 46 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 271 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్(43 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్స్లతో 103) శతక్కొట్టగా.. సూర్యకుమార్ యాదవ్(63), హార్దిక్ పాండ్యా(42) రాణించారు. అనంతరం భారీ లక్ష్య చేధనలో కివీస్ 225 పరుగులకు ఆలౌటైంది.
భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 5 వికెట్లతో చెలరేగాడు. ఇషాన్ కిషన్కు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ నిలవగా.. సూర్యకుమార్కు ప్లేయర్ ఆఫ్ది సిరీస్ అవార్డు దక్కింది. గతేడాది మొత్తం పేలవ ఫామ్తో ఇబ్బందిపడిన సూర్య.. కొత్త ఏడాదిలో మాత్రం దుమ్ములేపుతున్నాడు. ఈ ఐదు మ్యాచ్ల సిరీస్లో అతడు మూడు హాఫ్ సెంచరీలతో సత్తాచాటాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన సూర్యకుమార్ తన ఫామ్ను తిరిగి అందుకోవడంపై సంతోషం వ్యక్తం చేశాడు.
"ఈ క్షణం కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. నా రిథమ్ను తిరిగి అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. స్కై ఉన్నప్పుడు భయం ఎందుకని మురళీ కార్తీక్ గత సిరీస్లోనే చెప్పారు. నేను కొత్తగా ఏమీ ప్రయత్నించలేదు. నా బ్యాటింగ్లో కూడా ఎటువంటి మార్పులు చేసుకోలేదు.
ఎందుకంటే నేను 'అవుట్ ఆఫ్ ఫామ్' లో లేను, కేవలం 'అవుట్ ఆఫ్ రన్స్'లో ఉన్నానని నాకు తెలుసు ఒక మంచి ఇన్నింగ్స్తో నా రిథమ్ తిరిగి అందుకోవచ్చన్న థీమాతో ఉండేవాడిని. ఇప్పుడు ఎట్టకేలకు ఈ సిరీస్లో నా ఫామ్ను తిరిగి సాధించాను.
వరల్డ్కప్ వంటి మెగా టోర్నీకి ముందు తిరిగి ట్రాక్లో పడడం ఆనందంగా ఉంది. గత ఏడాది కాలంగా ఆకాశం(స్కై) నీలి రంగులో కన్పించలేదు. కానీ ఒక క్రీడాకారుడి జీవితంలో ఎత్త పల్లాలు సహజం. ఇటువంటి సమయంలో అసలు ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకుంటే తిరిగి కమ్బ్యాక్ ఇవ్వవచ్చు. ఇప్పుడు నేను అదే పనిచేశాను.
గత సిరీస్ తర్వాత దొరికిన విరామంలో సన్నిహితులతో గడిపాను. వారు చెప్పిన కొన్ని కీలక విషయాలు నన్ను ప్రేరేపించాయి. ఇక గెలిచినా, ఓడినా ప్రతి మ్యాచ్ నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటాం. ముంబైలో సౌత్ ఆఫ్రికాతో జరిగే వార్మప్ మ్యాచ్ తర్వాత, మాలో ఏవైనా లోపాలు ఉంటే సరిదిద్దుకుంటాము.
మిగితా ఫార్మాట్లతో పోలిస్తే టీ20 ఫార్మాట్ బౌలర్లకు ఒక కఠిన పరీక్ష వంటిది. మనం భారీ స్కోరు చేసినప్పుడు, ప్రత్యర్థి జట్టు కూడా అంతే ధీటుగా బదులు ఇస్తోంది. కెప్టెన్, బౌలింగ్ యూనిట్పై ఒత్తిడి ఉంటుంది. ఈ సమయంలో సరైన ప్రణాళికలతో ముందుకు వెళ్లడమే ఏకైక మార్గం" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో సూర్య పేర్కొన్నాడు.
చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్..


