చరిత్ర సృష్టించిన శివమ్‌ దూబే.. వరల్డ్‌లోనే తొలి ప్లేయర్‌గా | Shivam Dube Achieves Historic Feat, Becomes 1st Player In The World | Sakshi
Sakshi News home page

IND vs ENG: చరిత్ర సృష్టించిన శివమ్‌ దూబే.. వరల్డ్‌లోనే తొలి ప్లేయర్‌గా

Feb 4 2025 1:05 PM | Updated on Feb 4 2025 1:39 PM

Shivam Dube Achieves Historic Feat, Becomes 1st Player In The World

ముంబైలోని వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రిగిన ఐదో టీ20లో భార‌త్ 150 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ మ్య‌చ్‌లో అభిషేక్ శ‌ర్మతో పాటు శివ‌మ్ దూబే(Shivam Dube) కూడా ఆల్‌రౌండ్ షోతో అద‌రగొట్టాడు. 

తొలుత బ్యాటింగ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌ (13 బంతుల్లో 30 ప‌రుగులు) ఆడిన దూబే.. అనంత‌రం బౌలింగ్‌లో రెండు వికెట్ల‌తో స‌త్తాచాటాడు. ఫిల్ సాల్ట్‌, జాకబ్ బెత‌ల్ వంటి కీల‌క వికెట్లు ప‌డ‌గొట్టి భార‌త విజ‌యంలో త‌న‌వంతు పాత్ర పోషించాడు. ఈ క్ర‌మంలో దూబే ఓ అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. 

దూబే వరల్డ్‌ రి​కార్డు..
అంత‌ర్జాతీయ టీ20ల్లో వ‌రుస‌గా 30 విజయాలు సాధించిన జట్టులో భాగమైన తొలి క్రికెట‌ర్‌గా దూబే వ‌ర‌ల్డ్ రికార్డు సృష్టించాడు. దూబేకు భారత్ తరపున ఇది వరుసగా 30వ టీ20 విజయం కావడం గమనార్హం. దూబే తన కెరీర్‌లో టీమిండియా తరపున ఇప్పటివరకు 35 టీ20లు ఆడాడు. 2019లో ఢిల్లీ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20తో దూబే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు.

ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత అతడి ఐదో టీ20లో సైతం బంగ్లాదేశ్‌లో భారత్ ఓటమి చవిచూసింది. అప్పటి నుంచి దూబే ఆడిన ఏ టీ20 మ్యాచ్‌లోనూ టీమిండియా పరాజయం పాలవ్వలేదు. వరుసగా భార‌త్ 30 మ్యాచ్‌ల్లోనూ విజ‌యం సాధించింది.

ఈ అరుదైన ఫీట్ సాధించిన దూబేకు ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూప‌ర్ కింగ్స్ అభినంద‌నలు తెలిపింది. "దూబే ఆడితే భార‌త్ గెల‌వాల్సిందే. దూబే ఆడిన 30 మ్యాచ్‌ల్లోనూ భార‌త్ వ‌రుస‌గా విజ‌యం సాధిచిందని సీఎస్‌కే ఎక్స్‌లో రాసుకొచ్చింది.

కాగా ఇంగ్లండ్‌తో టీ20లకు దూబేకు తొలుత భార‌త జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు. నితీశ్ కుమార్ రెడ్డి గాయ‌ప‌డ‌డంతో దూబే జ‌ట్టులోకి వ‌చ్చాడు. పుణే వేదికగా జ‌రిగిన నాలుగో టీ20తో తుది జ‌ట్టులోకి వ‌చ్చిన దూబే.. అద్భుత‌మైన హాఫ్ సెంచరీతో చెల‌రేగాడు. ఆ మ్యాచ్‌లో కంక‌ష‌న్‌కు గురికావ‌డంతో బౌలింగ్ చేసే అవకాశం రాలేదు.

ఆఖరి టీ20లో మాత్రం తనకు వచ్చిన అవకాశాన్ని ఈ ముంబై ఆటగాడు అందిపుచ్చుకున్నాడు. కాగా టీ20 సిరీస్‌ ముగియడంతో దూబే ముంబై తరపున రంజీల్లో ఆడనున్నాడు. ఇక ఇది ఇలా ఉండగా.. భారత్‌-ఇంగ్లండ్‌​ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ నాగ్‌పూర్‌ వేదికగా ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభం కానుంది.

జట్లు
భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా

ఇంగ్లండ్: హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జోరూట్, జాకోబ్ బెతెల్, లియామ్ లివింగ్‌స్టోన్, బ్రైడన్ కార్స్, జేమీ ఓవర్టన్, జోస్ బట్లర్, జేమీ స్మిత్, ఫిలిప్ సాల్ట్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, సకీబ్ మహ్మూద్, మార్క్ వుడ్.
చదవండి: ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. సచిన్‌ వరల్డ్‌ రికార్డుపై కన్నేసిన కోహ్లి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement