IPL 2025: వీవీఐపీల మధ్య ఘర్షణ.. లైంగిక వేధింపుల కేసు పెట్టిన ఐపీఎస్‌ అధికారి భార్య | Sexual Harassment Case Filed By IPS Officer Wife During RCB VS CSK | Sakshi
Sakshi News home page

IPL 2025: వీవీఐపీల మధ్య ఘర్షణ.. లైంగిక వేధింపుల కేసు పెట్టిన ఐపీఎస్‌ అధికారి భార్య

May 6 2025 5:21 PM | Updated on May 6 2025 5:32 PM

Sexual Harassment Case Filed By IPS Officer Wife During RCB VS CSK

Photo Courtesy: BCCI

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా మే 3న జరిగిన ఆ​ర్సీబీ, సీఎస్‌కే మ్యాచ్‌ సందర్భంగా ఓ షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతున్న సమయంలో వీవీఐపీ ప్రేక్షకుల బాక్స్‌లో (బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో) రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో ఒక కుటుంబం ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ప్రముఖులకు చెందినది కాగా.. మరో కుటుంబం సీనియర్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ కుటుంబానికి చెందినది. 

ఈ రెండు కుటుంబాల మధ్య సీట్ల విషయంలో మొదలైన గొడవ చివరికి పోలీస్‌ స్టేషన్‌ వరకు వెళ్లింది. ఐపీఎల్‌ అధికారి భార్య ప్రత్యర్థి వర్గంపై లైంగి​క వేధింపుల కేసు పెట్టింది. ఆమెను, ఆమె కుమార్తెను లైంగిక​ంగా వేధించారని కబ్బన్‌ పార్క్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఇదిలా ఉంటే, నువ్వా నేనా అన్నట్లు సాగిన ఆ మ్యాచ్‌లో సీఎస్‌కేపై ఆర్సీబీ 2 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ.. జేకబ్‌ బేతెల్‌ (55), విరాట్‌ కోహ్లి (62), రొమారియో షెపర్ట్‌ (53 నాటౌట్‌) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. 

ఆఖర్లో షెపర్ట్‌ సునామీలా విరుచుకుపడి ఆర్సీబీకి భారీ స్కోర్‌ అందించాడు. షెపర్డ్‌ కేవలం 14 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో హాఫ్‌ సెంచరీని పూర్తి చేశాడు. ఈ హాఫ్‌ సెంచరీ ఐపీఎల్‌ చరిత్రలోనే రెండో వేగవంతమైంది.

ఖలీల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో షెపర్డ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి 4 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 33 పరుగులు పిండుకున్నాడు. పతిరణ వేసిన చివరి ఓవర్‌లోనూ అదే జోరు కొనసాగించిన షెపర్డ్‌ ఆ ఓవర్‌లో 2 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రాబట్టాడు.

అనంతరం 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్‌కే.. చివరి బంతి వరుకు పోరాడి నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేయగలిగింది. ఆయుశ్‌ మాత్రే (48 బంతుల్లో 94; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), రవీంద్ర జడేజా (45 బంతుల్లో 77 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) సీఎస్‌కేను గెలిపించేందుకు సర్వ శక్తులు ఒడ్డారు. 

చివరి ఓవర్‌లో సీఎస్‌కే గెలుపుకు 15 పరుగులు అవసరం కాగా.. యశ్‌ దయాల్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. జడేజా, ధోని, దూబే లాంటి విధ్వంసకర బ్యాటర్లు ఉన్నా 12 పరుగులకే పరిమితం చేశాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement