జురేల్, షేక్ రషీద్ అర్ధ సెంచరీలు
భారత్ ‘ఎ’ 333/4
శ్రీలంక ‘ఎ’తో అనధికారిక టెస్టు
గాలె (శ్రీలంక): ముక్కోణపు వన్డే టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత ‘ఎ’ జట్టు... శ్రీలంక ‘ఎ’తో జరుగుతున్న నాలుగు రోజుల తొలి అనధికారిక టెస్టులోనూ శుభారంభం చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన ధ్రువ్ జురేల్ సారథ్యంలోని భారత ‘ఎ’ జట్టు గురువారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 86 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది. టీమిండియా ప్లేయర్ సాయి సుదర్శన్ (175 బంతుల్లో 132; 19 ఫోర్లు) సూపర్ సెంచరీతో చెలరేగాడు.
సుదీర్ఘ ఫార్మాట్లో చక్కటి ప్రదర్శన కనబరుస్తున్న సుదర్శన్... లంక బౌలర్లపై అదే దూకుడు కొనసాగించాడు. కొలత వేసినట్లు బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. పూర్తి నియంత్రణతో బ్యాటింగ్ చేస్తూ జట్టుకు గట్టి పునాది వేశాడు. కెప్టెన్ ధ్రువ్ జురేల్ (138 బంతుల్లో 68 బ్యాటింగ్; 5 ఫోర్లు), ఆంధ్రప్రదేశ్ ఆటగాడు షేక్ రషీద్ (92 బంతుల్లో 53 బ్యాటింగ్; 4 ఫోర్లు) అజేయ అర్ధశతకాలతో రాణించారు.
ఈ జంట అబేధ్యమైన ఐదో వికెట్కు 116 పరుగులు జోడించింది. ఆయుశ్ పాండే (25), దేవదత్ పడిక్కల్ (12), రుతురాజ్ గైక్వాడ్ (22) ఎక్కువసేపు నిలవలేకపోయారు. లంక బౌలర్లలో డిలుమ్ సుదీరా 2 వికెట్లు పడగొట్టాడు. తొలి రోజు మనవాళ్లు 3.87 రన్రేట్తో పరుగులు సాధించారు.


