
సీఎస్కే కెప్టెన్, టీమిండియా యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ఇంగ్లండ్ కౌంటీల్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రాతినిథ్యం వహించిన యార్క్షైర్ జట్టుతో ఒప్పందం చేసుకున్నాడు. జులై నెలాఖరులో యార్క్షైర్తో జతకట్టనున్న రుతురాజ్.. కౌంటీ ఛాంపియన్షిప్, మెట్రో బ్యాంక్ వన్డే కప్ పూర్తయ్యే వరకు ఆ జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. 28 ఏళ్ల రుతురాజ్ కౌంటీల్లో ఆడటం ఇదే మొదటిసారి. కౌంటీల్లో ఆడబోయే తొలి మహారాష్ట్ర క్రికెటర్గా రుతురాజ్ రికార్డుల్లోకెక్కనున్నాడు.
రుతురాజ్ ప్రస్తుతం ఇంగ్లండ్లోనే ఉన్నాడు. ఇంగ్లండ్ లయన్స్తో ఆడుతున్న భారత-ఏ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అయితే ఈ సిరీస్లో అతని ఆడే అవకాశం రాలేదు. రుతురాజ్ తాజాగా ముగిసిన ఐపీఎల్ సందర్భంగా మోచేతి గాయానికి గురై సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ సీజన్లో రుతురాజ్ ఆరంభంలో కొన్ని మ్యాచ్లు ఆడాడు. రుతురాజ్ గత ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్కింగ్స్ బాధ్యతలు చేపట్టాడు.
2021లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రుతురాజ్ టీమిండియా తరఫున 6 వన్డేలు, 23 టీ20లు ఆడాడు. ఇందులో సెంచరీ, ఐదు అర్ద సెంచరీల సాయంతో 748 పరుగులు చేశాడు. 2022 ఏషియన్ గేమ్స్లో స్వర్ణం గెలిచిన భారత జట్టుకు రుతురాజ్ కెప్టెన్గా వ్యవహరించాడు.
2020లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన రుతురాజ్.. అప్పటి నుంచి సీఎస్కేకే ఆడుతూ 71 మ్యాచ్ల్లో 2 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీల సాయంతో 2502 పరుగులు చేశాడు.
దేశవాలీ క్రికెట్లో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహించే రుతురాజ్.. ఆ జట్టుకు పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. రుతురాజ్కు ఫస్ట్క్లాస్, లిస్ట్-ఏ ఫార్మాట్లలో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. రుతురాజ్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో 7, లిస్ట్-ఏ క్రికెట్లో 16 సెంచరీలు చేశాడు.
రుతురాజ్ యార్క్షైర్తో ఒప్పందం చేసుకోవడం పట్ల ఆ జట్టు హెడ్ కోచ్ ఆంధోని మెక్గ్రాత్ హర్షం వ్యక్తం చేశాడు. రుతురాజ్ కూడా యార్క్షైర్లో చేరడం పట్ల ఆసక్తిని వ్యక్త పరిచాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 1992లో యార్క్షైర్ తరఫున ఆడాడు. ఆ జట్టు తరఫున సచిన్ 16 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 46.52 సగటున 1070 పరుగులు చేశాడు.