టీమిండియా వెటరన్ ఓపెనర్ రోహిత్ శర్మకు (Rohit Sharma) సంబంధించిన ఓ వార్త సోషల్మీడియాలో వైరలవుతోంది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు సన్నాహకంగా రోహిత్ దేశవాలీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఆడేందుకు (ముంబై తరఫున) సిద్దంగా ఉన్నాడని ప్రచారం జరుగుతుంది.
ఈ టోర్నీలో పాల్గొనే విషయాన్ని రోహిత్ మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్కు తెలియజేశాడని, వారు కూడా సంతృప్తి వ్యక్తం చేశారని వార్తలు వస్తున్నాయి. విజయ్ హజారే ట్రోఫీతో పాటు కుదిరితే దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ రోహిత్ పాల్గొంటాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ విషయంపై తాజాగా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సెలెక్టర్ సంజయ్ పాటిల్ స్పందించాడు. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కొట్టి పారేశాడు. విజయ్ హజారే టోర్నీలో కానీ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో కానీ ఆడాలనుకున్న విషయాన్ని రోహిత్ తమ దృష్టికి తేలేదని స్పష్టం చేశాడు.
ప్రస్తుత పరిస్థితుల్లో రోహిత్ ముంబై తరఫున ఆడితే అది గొప్ప విషయని అన్నాడు. యువ ఆటగాళ్లకు ప్రేరణగా ఉంటుందని తెలిపాడు. ఆటగాళ్లు ఎంతటి వారైనా, జాతీయ జట్టు అవకాశాలు రావాలంటే దేశవాలీ క్రికెట్లో తప్పక ఆడాలని రూల్ పెట్టిన బీసీసీఐ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కార్, కోచ్ గౌతమ్ గంభీర్కు ధన్యవాదాలు తెలిపాడు.
కాగా, ఇటీవలికాలంలో టీమిండియా వెటరన్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి భవిష్యత్పై చర్చలు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న ఈ ఇద్దరు.. 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆడాలని అనుకుంటున్నారు. ఇది జరగాలంటే రో-కో ఫిట్నెస్తో పాటు ఫామ్ను కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ రో-కోకు దేశవాలీ టోర్నీల్లో ఆడాలని సూచించినట్లు తెలుస్తుంది.
ఆస్ట్రేలియా టూర్లో రోహిత్ మెరుపులు
భవిష్యత్తుపై గందరగోళం నెలకొన్న తరుణంలో రోహిత్ ఆస్ట్రేలియా టూర్లో సత్తా చాటాడు. 3 వన్డేల్లో సెంచరీ, హాఫ్ సెంచరీతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ సిరీస్లో రోహిత్ మునుపెన్నడూ కనబడని రీతిలో ఫిట్గా కనిపించాడు. ఇదే సిరీస్లో విరాట్ కోహ్లి తొలుత (తొలి 2 వన్డేల్లో డకౌట్) నిరాశపరిచినా.. ఆతర్వాత పర్వాలేదనిపించాడు (మూడో వన్డేలో హాఫ్ సెంచరీ).


