‘ఇంగ్లండ్‌తో టెస్టుల్లో అతడిని ఆడించండి.. అదరగొడతాడు’ | "He Seems Like A Class Player...": Ravi Shastri Urges BCCI Selectors To Consider This IPL Star For England Tests | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌తో టెస్టుల్లో అతడిని ఆడించండి.. అదరగొడతాడు: టీమిండియా మాజీ కోచ్‌

May 2 2025 3:49 PM | Updated on May 2 2025 5:58 PM

Ravi Shastri Urges BCCI Selectors To Consider This IPL Star For England Tests

Photo Courtesy: BCCI

ఐపీఎల్‌-2025 (IPL 2025) ముగిసిన తర్వాత టీమిండియా ఆటగాళ్లు మళ్లీ అంతర్జాతీయ షెడ్యూల్‌తో బిజీ కానున్నారు. ఇందులో భాగంగా తొలుత ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లనున్నారు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27 (WTC)లో భాగంగా టీమిండియా తమ తొలి సిరీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది.

ఇరుజట్ల మధ్య జూన్‌ 20 నుంచి ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్‌, కామెంటేటర్‌ రవిశాస్త్రి జట్టు ఎంపికపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లో అదరగొడుతున్న సాయి సుదర్శన్‌ను ఈ టూర్‌కు తప్పక సెలక్ట్‌ చేయాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI)కి విజ్ఞప్తి చేశాడు.

ఇంగ్లండ్‌తో టెస్టుల్లో అతడిని ఆడించండి..
మూడు ఫార్మాట్లలోనూ రాణించగల సత్తా సాయి సుదర్శన్‌కు ఉందన్న రవిశాస్త్రి.. అతడికి ఒక్క అవకాశం ఇవ్వాలని సెలక్టర్లకు సూచించాడు. ఈ మేరకు ఐసీసీ రివ్యూ షోలో మాట్లాడుతూ.. ‘‘సాయి సుదర్శన్‌.. అతడొక క్లాస్‌ ప్లేయర్‌. తను బ్యాటింగ్‌ చేస్తుంటే నేనైతే కళ్లు తిప్పుకోలేను.

అన్ని ఫార్మాట్లలోనూ అదరగొట్టగలడు. ఇంగ్లండ్‌ పరిస్థితులకు తగ్గట్లుగా ఎడమచేతి వాటం బ్యాటర్‌ అయిన సాయి తప్పక రాణించగలడు. అతడి టెక్నిక్‌ అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది.

ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లే జట్టులోని కొత్త ఆటగాళ్లలో నేనైతే సాయి సుదర్శన్‌కు మొదటి ప్రాధాన్యం ఇస్తాను’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. అదే విధంగా ఐసీసీ చాంపియన్‌స​ ట్రోఫీ-2025లో, ఐపీఎల్‌లో దుమ్ములేపుతున్న శ్రేయస్‌ అయ్యర్‌ కూడా ఈ సిరీస్‌ ద్వారా టెస్టుల్లో పునరాగమనం చేస్తాడని అంచనా వేశాడు.

అర్ష్‌దీప్‌ సింగ్‌ను కూడా ఆడిస్తే
అదే విధంగా పేస్‌ దళంలో రైటార్మ్‌ బౌలర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ తరచూ గాయాల బారిన పడుతున్న వేళ.. ఓ లెఫ్టార్మ్‌ సీమర్‌ను కూడా తీసుకోవాలని రవిశాస్త్రి సూచించాడు. వైట్‌బాల్‌ స్పెషలిస్టు అర్ష్‌దీప్‌ సింగ్‌ను టెస్టుల్లోనూ ఆడిస్తే బాగుంటుందని సూచించాడు.

కాగా ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న తమిళనాడు ఆటగాడు సాయి సుదర్శన్‌ ఓపెనర్‌గా దుమ్ములేపుతున్నాడు. ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి 456 పరుగులు చేసి.. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

రోహిత్‌ సిద్ధమే
మరోవైపు.. టీమిండియా టాప్‌ బ్యాటర్, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లడంపై సందిగ్ధత వీడింది. అతడు ఇంగ్లండ్‌కు వెళ్లడం దాదాపు ఖాయమైనట్లే. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో పాల్గొనే సీనియర్‌ టీమ్, భారత ‘ఎ’ జట్టు కోసం కలిపి సెలక్టర్లు ప్రాథమికంగా 35 మంది ప్రాబబుల్స్‌ను ఎంపిక చేశారు. 

ఇందులో రోహిత్‌ శర్మకు చోటు లభించింది. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్‌ 1–3తో ఓడిన తర్వాత రోహిత్‌ శర్మ టెస్టు భవితవ్యంపై సందేహాలు రేగాయి. ఈ సిరీస్‌లో భాగంగా సిడ్నీలో జరిగిన చివరి టెస్టులో ఫామ్‌ బాగా లేదంటూ రోహిత్‌ స్వచ్ఛందంగా తానే తుది జట్టు నుంచి తప్పుకున్నాడు. దాంతో అతని టెస్టు కెరీర్‌ ముగిసినట్లే అనిపించింది. 

ఈ ఫార్మాట్‌లో వరుసగా విఫలమవుతున్న అతను ఇంగ్లండ్‌కు వెళ్లక ముందే రిటైర్‌ కావచ్చని ఊహాగానాలు వచ్చాయి. అయితే ఇప్పుడు బీసీసీఐ సెలక్టర్లు ప్రాబబుల్స్‌ను ఎంపిక చేయడంతో వాటికి తెర పడినట్లే. అయితే రోహిత్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించే విషయంలో మాత్రం బీసీసీఐ తేల్చుకోలేకపోతోంది.

ఇంగ్లండ్‌లాంటి బలమైన జట్టుతో ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్‌ అంటే పూర్తి ఫామ్, ఫిట్‌నెస్‌ ఉన్న ఆటగాడిని ఎంపిక చేయడం సరైందిగా బోర్డు భావిస్తోంది. ఈ కోణంలో రోహిత్‌ తగిన వ్యక్తిగా కనిపించడం లేదు. 

అయితే ఇప్పటికిప్పుడు మరో సరైన ప్రత్యామ్నాయం లేకుండా రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించే సాహసం బోర్డు చేయకపోవచ్చు. పైగా ఇంగ్లండ్‌లాంటి టీమ్‌పై బలమైన నాయకుడు ఉంటే బాగుంటుందనే ఆలోచన కూడా బోర్డులో ఉంది కాబట్టి రోహిత్‌నే ఎంపిక చేసే అవకాశం ఉంది.  

చదవండి: సంజూ శాంసన్‌కు మద్దతు!.. శ్రీశాంత్‌పై మూడేళ్ల పాటు సస్పెన్షన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement