
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఏప్రిల్ 19న జైపూర్ వేదికగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్, రాజస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ ఫిక్స్ అయినట్లు రాజస్తాన్ క్రికెట్ సంఘం అడ్హక్ కమిటీ కన్వీనర్ జైదీప్ బిహానీ ఆరోపించారు.
సునాయసంగా గెలిచే మ్యాచ్లో రాజస్తాన్ ఉద్దేశపూర్వకంగా ఓడిపోయిందంటూ బిహానీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ ఆరోపణలపై రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యం స్పందించింది. తమపై చేస్తున్న ఆరోపణలు అన్ని అవాస్తమని రాయల్స్ ఫ్రాంచైజీ సీనియర్ అధికారి దీప్ రాయ్ ఖండించారు.
"అడ్ హాక్ కమిటీ కన్వీనర్ చేసిన అన్ని ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బహిరంగంగా చేసే ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు తప్పుదారి పట్టించడమే కాకుండా రాజస్థాన్ రాయల్స్, రాయల్ మల్టీ స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (RMPL), రాజస్థాన్ స్పోర్ట్స్ కౌన్సిల్, బీసీసీఐ ఖ్యాతి, విశ్వసనీయతకు తీవ్ర నష్టం కలిగించాయి.
అవి క్రికెట్ సమగ్రతను కూడా దెబ్బతీశాయి" అని రాయల్స్ ఫ్రాంచైజీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా రాయల్స్ యాజమాన్యం.. బిహానీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజస్థాన్ ముఖ్యమంత్రి, క్రీడా మంత్రి, క్రీడా కార్యదర్శికి లేఖ రాశారు.
అసలేమి జరిగిందంటే?
లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ అనుహ్యంగా రెండు పరుగులతో తేడాతో ఓడిపోయింది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 180 పరుగులు చేసింది. అనంతరం రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేయగల్గింది. ఆఖరి ఓవర్లో తమ విజయానికి 9 పరుగులు అవసరమవ్వగా రాజస్తాన్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.
చదవండి: ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రాజస్థాన్ రాయల్స్పై ఆరోపణలు