
ఐపీఎల్-2025 తర్వాత టీమిండియా ఇంగ్లండ్ పర్యటన (India vs England)తో బిజీకానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27 సీజన్లో భాగంగా ఇరుజట్ల మధ్య తొలి సిరీస్ జరుగునుంది. ఇందుకు సంబంధించి శనివారమే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జట్టును ప్రకటించింది.
వారికి గ్రీన్ సిగ్నల్
పద్దెనిమిది మంది సభ్యులతో కూడిన బృందానికి యువ ఆటగాడు శుబ్మన్ గిల్ను కెప్టెన్గా నియమించింది. ఇంగ్లండ్తో టెస్టులతో సారథిగా అతడి ప్రయాణం మొదలుకానుంది. ఇక ఈ జట్టులో సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్ చోటు దక్కించుకోగా.. అర్ష్దీప్ సింగ్ కూడా తొలిసారి టెస్టు టీమ్లోకి వచ్చాడు.
కరుణ్ రీ ఎంట్రీ
చాలా ఏళ్ల తర్వాత ‘ట్రిపుల్ సెంచూరియన్’ కరుణ్ నాయర్కు కూడా అవకాశం దక్కింది. మరోవైపు.. శార్దూల్ ఠాకూర్ కూడా పునరాగమనం చేశాడు. అయితే, సర్ఫరాజ్ ఖాన్కు మాత్రం సెలక్టర్లు ఇంగ్లండ్తో టెస్టులు ఆడే జట్టులో చోటివ్వలేదు. ఈ పరిణామాలపై టీమిండియా వెటరన్ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా స్పందించాడు.
అందుకే సర్ఫరాజ్పై వేటు!
‘‘ఆసియా, ఉపఖండ పిచ్లపై సర్ఫరాజ్ ఖాన్ విజయవంతమైన ఆటగాడిగా ఉన్నాడు. కానీ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లలో అతడు రాణించలేడని సెలక్టర్లు భావించి ఉండవచ్చు. అందుకే.. అతడికి ఈ జట్టులో చోటు ఇవ్వలేదనుకుంటా.
అంతేకాదు.. అతడికి ఫిట్నెస్ సమస్యలు ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే, ప్రస్తుతం సర్ఫరాజ్ ఫిట్నెస్ గురించి నాకైతే సమాచారం లేదు. ఫిట్గా ఉండేందుకు అతడు అన్ని రకాలుగా తీవ్రంగా శ్రమిస్తున్నాడని మాత్రం తెలుసు.
రీఎంట్రీకి అతడు అర్హుడు
ఏదేమైనా దురదృష్టవశాత్తూ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, కరుణ్ నాయర్ ఎంపిక పట్ల సంతోషంగా ఉంది. దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా ఆడుతున్న అతడు జట్టులో చోటుకు అర్హుడు’’ అని పుజారా హిందుస్తాన్ టైమ్స్తో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
కాగా టీమిండియా చివరగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడింది. ఈ టెస్టు సిరీస్కు సర్ఫరాజ్ ఎంపికైనా ఒక్క మ్యాచ్ కూడా అడే అవకాశం రాలేదు.
ఇక టీమిండియా- ఇంగ్లండ్ మధ్య జూన్ 20 నుంచి ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. కాగా దేశవాళీ క్రికెట్తో పాటు కౌంటీల్లోనూ రాణిస్తున్న పుజారా సైతం టెస్టు జట్టులో పునరాగమనం కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే, అతడి కల ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు.
ఇంగ్లండ్తో టెస్టులకు భారత జట్టు
శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.
చదవండి: కోపంతో ఊగిపోయిన సిరాజ్.. ఇదేంటి మియా?.. అతడి పట్ల ఇలాగేనా ప్రవర్తించేది?