టీమిండియాపై పాక్‌ క్రికెటర్‌ సంచలన ఆరోపణలు | Pakistan star serves fresh conspiracy against India with shocking claim, Umpiring calls go in their favour | Sakshi
Sakshi News home page

టీమిండియాపై పాక్‌ క్రికెటర్‌ సంచలన ఆరోపణలు

Jun 7 2026 7:45 PM | Updated on Jun 7 2026 8:59 PM

Pakistan star serves fresh conspiracy against India with shocking claim, Umpiring calls go in their favour

పాకిస్తాన్ ఆల్‌రౌండర్ ఖుష్దిల్‌ షా టీమిండియాను ఉద్దేశిస్తూ సంచలన ఆరోపణలు చేశాడు. తమ మధ్య జరిగే మ్యాచ్‌ల్లో అంపైరింగ్ నిర్ణయాలు, షెడ్యూలింగ్ సహా అనేక అంశాలు భారత్‌కు అనుకూలంగా ఉంటాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. భారత్‌తో మ్యాచ్‌ల్లో చాలా విషయాలు వాళ్లకు అనుకూలంగా ఉంటాయి. అంపైరింగ్ నిర్ణయాలు, కొన్ని డ్రెస్సింగ్‌రూమ్ నిర్ణయాలు, మ్యాచ్‌ల నిర్వహణ కూడా వారి కోరికల మేరకే జరుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ గెలిస్తే ఆ ఆనందం మరింత ఎక్కువగా ఉంటుందని అన్నాడు.

భారత్ ఆధిపత్యం కొనసాగుతుండటంతో..
ఇటీవలికాలంలో భారత్‌పై పాకిస్తాన్ రికార్డు నిరాశాజనకంగా ఉంది. టీమిండియాపై పాక్‌ చివరిసారి 2022 ఆసియా కప్ సూపర్-4 దశలో విజయం సాధించింది. అప్పటి నుంచి జరిగిన ఆరు వరుస మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది.

వన్డేల్లో అయితే 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత పాకిస్తాన్ భారత్‌ను ఓడించలేదు. ఆ తర్వాత ఇరు జట్ల మధ్య జరిగిన ఆరు వన్డేల్లోనూ భారత్‌దే పైచేయిగా నిలిచింది.

గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు
భారత్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రత్యేక ప్రాధాన్యం లభిస్తోందని కొందరు పాక్‌ మాజీలు గతంలోనూ ఆరోపించారు. అయితే ప్రస్తుత క్రికెటర్‌ ఖుష్దిల్ షా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.

ఖుష్దిల్‌ షా భారత్‌పై ఒక వన్డే, రెండు టీ20లు ఆడాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో జరిగిన వన్డేలో 39 బంతుల్లో 38 పరుగులు చేసి, వికెట్ తీసుకున్నప్పటికీ, ఆ మ్యాచ్‌లో పాక్‌ను ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు. మొత్తంగా షా పాక్‌ తరఫున 15 వన్డేలు, 38 టీ20లు ఆడి 762 పరుగులు చేసి, 10 వికెట్లు తీశాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement