
ఇంగ్లండ్తో రెండో టెస్టు నేపథ్యంలో భారత తుదిజట్టు ఎంపిక ఆసక్తికరంగా మారింది. ఎవరిపై వేటు వేస్తారు? ఎవరికి కొత్తగా అవకాశం ఇస్తారు?.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు?.. అన్న అంశాలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)ని టీమిండియా పరాజయంతో మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా లీడ్స్లో జరిగిన తొలి మ్యాచ్లో గిల్ సేన ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. బ్యాటర్లు ఫర్వాలేదనిపించినా.. బౌలర్లు విఫలమయ్యారు. ఇక ఫీల్డింగ్లో అయితే టీమిండియా చెత్త ప్రదర్శన కనబరిచింది. ఏకంగా ఆరు క్యాచ్లు డ్రాప్ చేసి.. మూల్యం చెల్లించింది.
శార్దూల్ విఫలం.. నితీశ్ రెడ్డికి అవకాశం?
ఇక ఈ మ్యాచ్ సందర్భంగా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇటు లోయర్ ఆర్డర్లో.. అటు బౌలింగ్లో అతడు పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్లో కలిపి ఐదు పరుగులు చేసిన శార్దూల్.. మొత్తంగా రెండు వికెట్లు తీశాడు.
ఆల్రౌండర్గా రాణిస్తాడనుకుంటే.. అతడి వల్ల ఉపయోగం లేకుండా పోయిందంటూ మాజీ క్రికెటర్లు సైతం శార్దూల్ను విమర్శించారు. ఈ నేపథ్యంలో రెండో టెస్టులో అతడిపై వేటు పడే అవకాశం ఉందని.. అతడి స్థానంలో ఆంధ్ర యువ సంచలనం నితీశ్ కుమార్ రెడ్డి జట్టులోకి వస్తాడని విశ్లేషకులు భావిస్తున్నారు.
నితీశ్ కాదు!.. శార్దూల్ స్థానంలో అతడే కరెక్ట్!
అయితే, టీమిండియా మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘రెండో టెస్టు నుంచి శార్దూల్ ఠాకూర్ను తప్పిస్తారనే అనిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే అతడి స్థానాన్ని బౌలర్తోనే భర్తీ చేయాలి.
ప్రసిద్ కృష్ణ సంగతి పక్కనపెడితే.. వైవిధ్యం కోసం పేసర్ అర్ష్దీప్ సింగ్ను లేదంటే చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను తుదిజట్టులోకి తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. ఏదేమైనా పిచ్ స్వభావాన్ని బట్టే వీరిద్దరిలో ఒకరు ఫైనల్ అవుతారు’’ అని బద్రీనాథ్ అభిప్రాయపడ్డాడు. కుల్దీప్ యాదవ్ ఆడే అవకాశం ఎక్కువగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
కాగా తమిళనాడుకు చెందిన బద్రీనాథ్ 2008- 2011 మధ్య టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. రెండు టెస్టులు, ఏడు వన్డేలు, ఒక టీ20 ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో 63, 79, 43 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. భారత్- ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు (జూలై 2-6)కు బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియం వేదిక.
ఇంగ్లండ్తో టెస్టులకు భారత జట్టు:
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, అభిమన్యు ఈశ్వరన్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, ధ్రువ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా.