
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన డ్రీమ్ టీ20 ఎలెవన్ (Dream T20 Eleven)ను ప్రకటించాడు. ఇందులో భారత దిగ్గజ టీ20 స్టార్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లి (Virat Kohli)లకు మాత్రం చోటు దక్కలేదు. అయితే, ఇందులో ఓ ట్విస్టు ఉంది. కాగా కర్ణాటకలోని బీదర్లో జన్మించిన వరుణ్ తొలుత ఆర్కిటెక్ట్గా పనిచేశాడు.
నటన వైపు అడుగులు
ఆ తర్వాత గిటార్ ప్లేయర్గానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అవుదామని తన స్నేహితులతో కలిసి ఓ సినిమా షూటింగ్కు వెళ్లాడు. అయితే, అక్కడ ఆ అవకాశం దొరకలేదు కానీ.. క్రికెట్ ఆడతాడు కాబట్టి ఆ సినిమాలోని ఓ పాత్రకు వరుణ్ ఎంపికయ్యాడు. అలా నటుడిగా మారిన తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్స్'కు దర్శకుడిగానూ వ్యవహరించాడు.
క్రికెట్ నైపుణ్యాలకు మెరుగుపెట్టుకుని
అయితే, తర్వాత మళ్లీ పాత కథే. ఇంటీరియర్ డిజైనర్గా సత్తా చాటాలనుకుని కంపెనీ పెట్టి చేతులు కాల్చుకున్నాడు. పాతికేళ్ల వయసుకే ఇన్ని అనుభవాలు సంపాదించిన వరుణ్.. క్రికెట్ నైపుణ్యాలకు మెరుగుపెట్టుకుని అంచెలంచెలుగా ఎదుగుతూ టీమిండియాకు ఆడే స్థాయికి చేరుకున్నాడు.
శ్రీలంకతో టీ20 మ్యాచ్ సందర్భంగా 2021లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన వరుణ్ చక్రవర్తి.. ఈ ఏడాది వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025ని భారత్ కైవసం చేసుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 18 టీ20లు, నాలుగు వన్డేలు ఆడిన ఈ రైటార్మ్ లెగ్బ్రేక్ స్పిన్నర్ వరుసగా 33, 10 వికెట్లు తీశాడు.
ట్విస్ట్ ఏమిటంటే
ప్రస్తుతం విరామం తీసుకుంటున్న వరుణ్ చక్రవర్తి.. మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా తన డ్రీమ్ టీ20 ఎలెవన్ను చెప్పాలంటూ అశూ.. వరుణ్ను అడిగాడు. అయితే, ఇక్కడే ఓ మెలిక పెట్టాడు. వరుణ్తో కలిసి ఆడిన ఆటగాళ్ల నుంచే జట్టును ఎంపిక చేసుకోవాలని చెప్పాడు.
ఈ క్రమంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి దిగ్గజాలను వదిలేసి వరుణ్ తన జట్టును ప్రకటించాడు. ఓపెనర్లుగా బట్లర్, హెడ్లను ఎంచుకున్న అతడు.. వన్డౌన్లో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు చోటిచ్చాడు. అదే విధంగా.. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్లో తన సహచర ఆటగాళ్లైన ఆండ్రీ రసెల్, సునిల్ నరైన్లను కూడా వరుణ్ తన జట్టులోకి ఎంపిక చేసుకున్నాడు.
ఇక టీమిండియా నుంచి సూర్యతో పాటు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలకు స్థానం కల్పించాడు. స్పిన్నర్ల జాబితాలో రషీద్ ఖాన్కు పెద్దపీట వేశాడు. శ్రీలంక యువ పేసర్ పతిరణకు కూడా వరుణ్ తన జట్టులో చోటిచ్చాడు.
వరుణ్ చక్రవర్తి డ్రీమ్ టీ20 ఎలెవన్:
జోస్ బట్లర్ (ఇంగ్లండ్), ట్రవిస్ హెడ్ (ఆస్ట్రేలియా), సూర్యకుమార్ యాదవ్ (ఇండియా), నికోలస్ పూరన్ (వెస్టిండీస్), హెన్రిచ్ క్లాసెన్ (సౌతాఫ్రికా), హార్దిక్ పాండ్యా (ఇండియా), ఆండ్రీ రసెల్ (వెస్టిండీస్), సునిల్ నరైన్(వెస్టిండీస్), రషీద్ ఖాన్ (అఫ్గనిస్తాన్), జస్ప్రీత్ బుమ్రా (ఇండియా), మతీశ పతిరణ (శ్రీలంక).
చదవండి: ‘షర్మిలా ఠాగూర్, సైఫ్ అలీ ఖాన్ను పిలవండి.. ఎవరూ వేలెత్తి చూపరు’