
బంగ్లాదేశ్ క్రికెట్కు గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశముంది. శ్రీలంకతో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత బంగ్లాదేశ్ టెస్టు కెప్టెన్సీ నుంచి నజ్ముల్ హొస్సేన్ షాంటో తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన నిర్ణయాన్ని బంగ్లా క్రికెట్ బోర్డుకు షాంటో తెలియజేసినట్లు సమాచారం బంగ్లాదేశ్ ఆల్ఫార్మాట్ కెప్టెన్గా గతేడాది ఆరంభంలో షాంటో బాధ్యతలు చేపట్టాడు.
కానీ ఏడాది కాలంలోనే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న షాంటో.. వన్డే, టెస్టుల్లో సారథిగా కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. కానీ బీసీబీ మాత్రం అతడికి ఊహించని షాకిచ్చింది. ఈ నెల 12న అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన బంగ్లా క్రికెట్ బోర్డు.. అనూహ్యంగా వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి షాంటోని తప్పించింది.
అతడి స్ధానంలో స్టార్ ఆల్రౌండర్ మెహది హసన్ మిరాజ్కు ఆ బాధ్యతలు అప్పగించింది. దీంతో బీసీబీ నిర్ణయం పట్ల షాంటో ఆసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రెడ్బాల్ కెప్టెన్సీ నుంచి కూడా వైదొలగాలని షాంటో యోచిస్తున్నట్లు క్రిక్బజ్ తమ రిపోర్ట్లో పేర్కొంది.
కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగే రెండో టెస్టు అనంతరం దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. అయితే ఈ వార్తలపై బీసీబీ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు.గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్లలోనూ షాంటో సెంచరీతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్లో 148 పరుగులు చేసిన షాంటో.. రెండో ఇన్నింగ్స్లో 125 రన్స్ చేశాడు. అయితే ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండో టెస్టు జూన్ 25 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: ఎప్పుడో నా కెరీర్ ముగిసిందన్నారు.. కానీ పదేళ్లు పూర్తి చేసుకున్నాను: బుమ్రా