సారీ చెప్పినా సరే!.. ముంబై ఇండియన్స్‌ స్టార్‌పై ఏడాది నిషేధం | Mumbai Indians Star Banned By PCB After Breaching Contract To Join IPL 2025 | Sakshi
Sakshi News home page

ముంబై ఇండియన్స్‌ స్టార్‌పై ఏడాది నిషేధం.. సారీ చెప్పినా సరే..

Apr 11 2025 1:54 PM | Updated on Apr 11 2025 3:25 PM

Mumbai Indians Star Banned By PCB After Breaching Contract To Join IPL 2025

PC: SAT20

సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌, ముంబై ఇండియన్స్‌ ఆటగాడు కార్బిన్‌ బాష్‌ (Corbin Bosch)పై పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) నిషేధం విధించింది. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL)లో పాల్గొనకుండా ఏడాది పాటు బ్యాన్‌ చేసింది. ఇందుకు సంబంధించి పీసీబీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

కాగా పీఎస్‌ఎల్‌-2025 (IPL 2025) సీజన్‌కు గానూ పెషావర్‌ జల్మీ ఫ్రాంఛైజీ బాష్‌ను జట్టులోకి తీసుకుంది. దీంతో జట్టుతో అతడు కాంట్రాక్ట్‌ కుదుర్చుకున్నాడు. నిజానికి ఈ ప్రొటిస్‌ పేసర్‌ ముందు నుంచి ఐపీఎల్‌ వైపే మొగ్గు చూపాడు. కానీ మెగా వేలం-2025లో అతడిని ఎవరూ కొనలేదు.

అలా అదృష్టం వరించింది..
అయితే, సహచర ఆటగాడు లిజాడ్‌ విలియమ్స్‌ గాయం కారణంగా ఐపీఎల్‌-2025కి దూరం కావడంతో.. బాష్‌ను అదృష్టం వరించింది. ముంబై ఇండియన్స్‌ జట్టు విలియమ్స్‌ స్థానంలో బాష్‌ను ఎంపిక చేసింది. అయితే, ఐపీఎల్‌ జరుగుతున్న సమయంలోనే పీఎస్‌ఎల్‌ కూడా నిర్వహించాలనే పీసీబీ నిర్ణయం వల్ల బాష్‌ వంటి విదేశీ ఆటగాళ్లకు ఇబ్బందులు ఎదురయ్యాయి.

ఐపీఎల్‌ లేదంటే పీఎస్‌ఎల్‌.. ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే ఆడేందుకు వీలు పడుతుంది.. కాబట్టి సహజంగానే డబ్బుకు డబ్బు.. పేరుకు పేరు వచ్చే ఐపీఎల్‌కే ఓటు వేసిన బాష్‌.. పీఎస్‌ఎల్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో అతడికి పీసీబీ నోటీసులు జారీ చేసింది.

సారీ.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా
ఇందుకు బదులుగా.. ‘‘విజయవంతమైన, వివిధ దేశాల టీ20 లీగ్‌లలో భాగమైన ముంబై ఇండియన్స్‌ వంటి మేటి ఫ్రాంఛైజీ ఆఫర్‌ను కాదంటే.. నాకు భవిష్యత్తులో మళ్లీ ఈ అవకాశం రాకపోవచ్చు. అందుకే పెషావర్‌ జల్మీ నుంచి వైదొలిగాను’’ అని బాష్‌ వివరణ ఇచ్చాడు. అయితే, పీసీబీ మాత్రం అతడిపై ఏడాది పాటు వేటు వేస్తూ నిర్ణయం తసీఉకుంది.

‘‘ఈ ఆల్‌రౌండర్‌పై ఏడాది కాలం నిషేధం విధిస్తున్నాం. వచ్చే ఏడాది పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ సెలక్షన్‌కు అతడు అర్హత పొందలేడు’’ అని పీసీబీ తమ ప్రకటనలో పేర్కొంది. కాగా లీగల్‌ నోటీసులు అందుకున్న సమయంలోనే బాష్‌.. ‘‘నా నిర్ణయం పట్ల నాకూ పశ్చాత్తాపంగానే ఉంది. అందుకే పాకిస్తాన్‌ ప్రజలకు, పెషావర్‌ జల్మీ అభిమానులకు క్షమాపణలు చెబుతున్నా.

నా చర్యల వల్ల మీ మనసు బాధపడి ఉంటుందని తెలుసు. అయితే, నా భవిష్యత్తు గురించి కూడా ఆలోచించుకోవాలి. త్వరలోనే పీఎస్‌ఎల్‌లో పునరాగమనం చేసేందుకు ఎదురుచూస్తున్నా’’ అని బహిరంగంగానే క్షమాపణలు చెప్పాడు. కానీ పీసీబీ మాత్రం ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

కాగా ఏప్రిల్‌ 11 నుంచి పీఎస్‌ఎల్‌ ప్రారంభం కానుంది. కాగా ఐపీఎల్‌లో 30 ఏళ్ల బాష్‌ ఇంతవరకు అరంగేట్రం చేయలేదు. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా మాత్రం సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌గా వచ్చి రిషభ్‌ పంత్‌ క్యాచ్‌ అందుకున్నాడు. అయితే, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో అతడు ముంబైకి ఆడుతుండటం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2025లో ముంబై ఇప్పటికి ఐదు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒకటే గెలిచింది.

చదవండి: CSK Vs KKR: ‘ద్రోహి వచ్చేశాడు చూడండి... జీవితం చాలా చిత్రమైనది’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement