
గాయం నుంచి కోలుకున్న ముంబై స్టార్ పేసర్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో నేడు ముంబై ఇండియన్స్ ‘ఢీ’
రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ 18వ సీజన్లో మరో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. ఐదుసార్లు చాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు సొంతగడ్డపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో పోరుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ సాధించలేకపోయిన ఆర్సీబీ... ఈసారి ఆరంభం నుంచే మంచి ప్రదర్శన చేస్తుంటే... మరోవైపు లీగ్లో ఘన చరిత్ర ఉన్న ముంబై ఇండియన్స్ పడుతూ లేస్తూ సాగుతోంది.
బెంగళూరు ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండింట గెలవగా... హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ నాలుగు మ్యాచ్ల్లో కేవలం ఒక్క దాంట్లోనే విజయం సాధించింది. బ్యాటర్ల వైఫల్యం ముంబైని ఇబ్బంది పెడుతున్నా... స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పునరాగమనంతో జట్టు బలం రెట్టింపైంది.
సోమవారం మ్యాచ్కు బుమ్రా అందుబాటులో ఉంటాడని ముంబై కోచ్ జయవర్ధనే వెల్లడించడంతో... ఇది బెంగళూరు బ్యాటింగ్కు బుమ్రా బౌలింగ్కు మధ్య సమరంగా మారిపోయింది. మరోవైపు తొలి రెండు మ్యాచ్ల్లో గెలిచి జోరు కనబర్చిన ఆర్సీబీ... చివరి మ్యాచ్లో గుజరాత్ చేతిలో ఓడింది. తిరిగి గెలుపు బాటపట్టాలని బెంగళూరు ఎదురుచూస్తోంది.
బ్యాటర్లు రాణిస్తేనే...
ముంబై ఇండియన్స్ ప్రధాన బలమైన స్టార్ బ్యాటర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ప్రభావం చూపలేకపోగా... హైదరాబాద్ ఆటగాడు ఠాకూర్ తిలక్ వర్మ మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు. నాలుగు మ్యాచ్ల్లో కలిసి ముంబై జట్టు తరఫున ఇప్పటి వరకు కేవలం రెండే అర్ధశతకాలు నమోదయ్యాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
సూర్యకుమార్ యాదవ్, రికెల్టన్ చెరో హాఫ్ సెంచరీ చేశారు. ప్రాక్టీస్లో గాయం కారణంగా లక్నోతో మ్యాచ్లో బరిలోకి దిగని రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో ఆడే అవకాశం ఉంది. తాజా సీజన్లో 177 పరుగులు చేసిన సూర్యకుమార్ అదే ప్రదర్శన కొనసాగించాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఫర్వాలేదనిపిస్తున్నా... బ్యాటింగ్లో మరింత ధాటిగా ఆడాల్సిన అవసరముంది.
లక్నోతో పోరులో వికెట్లు చేతిలో ఉన్నా... భారీ షాట్లు ఆడలేక ఇబ్బంది పడిన ముంబై... ప్రాక్టీస్లో తమ లోపాలపై దృష్టి పెట్టింది. బౌల్ట్, పాండ్యా, అశ్వని కుమార్, దీపక్ చాహర్, విఘ్నేశ్ పుతుర్ రూపంలో ముంబైకి మెరుగైన బౌలింగ్ దళమే ఉంది. బుమ్రా రాకతో ముంబై బౌలింగ్ దళం మరింత పటిష్టమైంది.
కోహ్లిపైనే భారం...
ఐపీఎల్ ఆరంభం నుంచి ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ కోహ్లిపైనే బెంగళూరు ఎక్కువగా ఆధార పడుతోంది. సీజన్ ఆరంభ పోరులో అర్ధశతకంతో ఆకట్టుకున్న విరాట్... ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేకపోతున్నాడు. మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ నుంచి మరింత బాధ్యతాయుత ఇన్నింగ్స్ రావాల్సి ఉంది. మిడిలార్డర్లో కెపె్టన్ రజత్ పాటీదార్తో పాటు దేవదత్ పడిక్కల్ ప్రభావం చూపలేకపోతున్నారు. వీరిద్దరు నిలకడ కనబర్చాల్సిన అవసరముంది.
ఇంగ్లండ్ ఆల్రౌండర్ లివింగ్స్టోన్, జితేశ్ శర్మ మంచి టచ్లో ఉండగా... కృనాల్ పాండ్యా అటు బంతితో, ఇటు బ్యాట్తో రాణించాల్సిన అవసరముంది. గతంలో ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహించిన టిమ్ డేవిడ్ ఈ మ్యాచ్లో కీలకం కానున్నాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే గత సీజన్లతో పోల్చుకుంటే బెంగళూరు బౌలింగ్ దళం ఈసారి బలంగా కనిపిస్తోంది.
ఆ్రస్టేలియా పేసర్ హాజల్వుడ్తో పాటు ఐపీఎల్లో అపార అనుభవమున్న భువనేశ్వర్, యశ్ దయాళ్ పేస్ భారాన్ని మోయనున్నారు. లివింగ్స్టోన్, రసిక్ సలామ్తో కలిసి కృనాల్ పాండ్యా స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నాడు.