ధోనిని ఆత్మీయంగా హత్తుకున్న రాధిక.. తలా ఎమోషనల్‌ నోట్‌ | MS Dhoni Pens Emotional Note For Anant Ambani Radhika, Post Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Dhoni Emotional Post: రాధికను ఆత్మీయంగా హత్తుకున్న ధోని.. ఎమోషనల్‌ నోట్‌ వైరల్‌

Jul 15 2024 12:53 PM | Updated on Jul 15 2024 1:39 PM

MS Dhoni Pens Emotional Note For Anant Ambani Radhika Pic Goes Viral

ధోనిని ఆత్మీయంగా హత్తుకున్న రాధిక(PC: Insta)

టీమిండియా దిగ్గజ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని సోషల్‌ మీడియాకు కాస్త దూరంగానే ఉంటాడు. ప్రత్యేక సందర్భాల్లో తప్ప మహీ ఫొటోలు పోస్ట్‌ చేయడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మిస్టర్‌ కూల్‌కు 49.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. కానీ, ఇప్పటి వరకు అతడు పెట్టిన పోస్టులు కేవలం 111. అయితే, తాజాగా ధోని ఓ అద్భుతమైన ఫొటోను షేర్‌ చేస్తూ అందమైన క్యాప్షన్‌ జతచేశాడు.

గ్రాండ్‌ వెడ్డింగ్‌
ప్రస్తుతం అతడి పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ అదేంటంటే.. భారత కుబేరుడు ముఖేశ్‌ అంబానీ- నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.

వ్యాపారవేత్త వీరేన్‌ మర్చంట్‌- శైలా మర్చంట్‌ల కుమార్తె రాధికా మర్చంట్‌తో అనంత్‌ పెళ్లి జరిగింది. ముంబైలో జూలై 12న జరిగిన ఈ గ్రాండ్‌ వెడ్డింగ్‌కు ప్రపంచ నలుమూలల నుంచి క్రీడా, సినీ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు.

మహేంద్ర సింగ్‌ ధోని సైతం తన సతీమణి సాక్షి, కుమార్తె జివా ధోనితో కలిసి అనంత్‌- రాధికల పెళ్లికి వెళ్లాడు. బారాత్‌లో డాన్స్‌ చేస్తూ సందడి చేశాడు కూడా!

ఇక వివాహ తంతు ముగిసిన అనంతరం ధోని దంపతులు ప్రత్యేకంగా కొత్త జంటను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నవ వధువు రాధికా మర్చంట్‌ నవ్వులు చిందిస్తూ ధోనిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకోగా.. అనంత్‌ చిరునవ్వుతో మహీ చేతిని పట్టుకున్నాడు.

రాధికా.. అనంత్‌ అంటూ ధోని ఎమోషనల్‌ నోట్‌
ఇందుకు సంబంధించిన ఫొటోను మహేంద్ర సింగ్‌ ధోని ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. అంబానీల నూతన జంటను ఉద్దేశించి.. ‘‘రాధికా.. నీ ప్రకాశవంతమైన చిరునవ్వు ఎప్పటికీ ఇలాగే వెలిగిపోతూ ఉండాలి.

అనంత్‌.. మేమందరం చుట్టూ ఉన్నపుడు ఎలాగైతే నువ్వు రాధిక పట్ల ప్రేమను కురిపించావో.. ఎల్లప్పుడూ అలాగే ఉండు ప్లీజ్‌.

మీ వైవాహిక జీవితం సంతోషాలతో నిండిపోవాలి. త్వరలోనే మిమ్మల్ని మళ్లీ కలుస్తాను. వీరేన్‌ అంకుల్‌ కోసం ఓ పాట’’ అంటూ ధోని ఉద్వేగపూరిత నోట్‌ పంచుకున్నాడు. ఈ ఫొటోకు ఇప్పటికే 8 మిలియన్లకు పైగా లైకులు రావడం విశేషం.

‍కాగా భారత్‌కు టీ20 ప్రపంచకప్‌-2007, వన్డే వరల్డ్‌కప్‌-2011, చాంపియన్స్‌ ట్రోఫీ-2013 అందించిన జార్ఖండ్‌ ‘డైనమైట్‌’ ధోని.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఐదుసార్లు విజేతగా నిలిపాడు.

ఇక ఈ ఏడాది చెన్నై కెప్టెన్సీ నుంచి తప్పుకొని రుతురాజ్‌ గైక్వాడ్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించిన 43 ఏళ్ల ధోని.. ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

చదవండి: Copa America 2024: కోపా అమెరికా కప్‌ విజేతగా అర్జెంటీనా.. మెస్సీకి గిఫ్ట్‌

Advertisement
 
Advertisement
Advertisement