ధోని అందుకున్న అత్యుత్తమ పురస్కారాలు ఇవే..! | MS Dhoni Gets Highest ICC Honour, List Of All Awards Won By Indian Legend | Sakshi
Sakshi News home page

ధోని అందుకున్న అత్యుత్తమ పురస్కారాలు ఇవే..!

Jun 11 2025 10:22 AM | Updated on Jun 11 2025 11:29 AM

MS Dhoni Gets Highest ICC Honour, List Of All Awards Won By Indian Legend

క్రికెట్‌కు అందించిన విశేష సేవలకు గానూ టీమిండియా దిగ్గజ ఆటగాడు ఎంఎస్‌ ధోనిని ఐసీసీ తాజాగా హాల్‌ ఆఫ్‌ ఫేమర్ల జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న 11వ భారత క్రికెటర్‌గా ధోని రికార్డుల్లోకెక్కాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా ధోని భారత క్రికెట్‌కు ఎంతో చేశాడు.

బ్యాటర్‌గా 17000కు పైగా పరుగులు, వికెట్‌ కీపర్‌గా 824 మందిని ఔట్‌ చేయడంతో భాగం కావడంతో పాటు టీమిండియాను టీ20 వరల్డ్‌కప్‌ (2007), వన్డే వరల్డ్‌కప్‌ (2011), ఛాంపియన్స్‌ ట్రోఫీ (2013) విజేతగా నిలిపాడు. ప్రపంచ క్రికెట్‌లో మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన కెప్టెన్‌ ధోని ఒక్కడే.

క్రికెట్‌లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ధోనికి తాజాగా లభించిన ఐసీసీ అత్యున్నత హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ పురస్కారంతో పాటు ఎన్నో పురస్కారాలు లభించాయి. పురస్కారాల విషయంలో ధోని ప్రస్తానం ఎంటీవీ యూత్‌ ఐకాన్‌తో మొదలైంది. 

అప్పుడ్పుడే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ధోనిని 2006లో ఎంటీవీ యూత్‌ ఐకాన్‌ పురస్కారంతో సత్కరించింది. కెరీర్‌ తొలినాళ్లలో ధోని పొడవాటి జులపాలతో యూత్‌ను తెగ ఆకర్శించాడు. అప్పట్లో ధోని క్రేజ్‌ వేరే లెవెల్లో ఉండేది. ఇందుకే ఎంటీవీ ధోనిని యూత్‌ ఐకాన్‌గా నామినేట్‌ చేసింది.

ధోనికి తొలి ప్రతిష్టాత్మక అవార్డు 2008లో లభించింది. అప్పటికే టీమిండియాను టీ20 ఛాంపియన్‌గా నిలిపిన ధోనికి ఆ ఏడాది మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న పురస్కారం లభించింది. భారత ప్రభుత్వం ధోనిని ఈ అవార్డును నామినేట్‌ చేసింది.

అదే ఏడాది (2008) ధోని తొలిసారి ఐసీసీ వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు గెలుచుకున్నాడు. ఆ మరుసటి ఏడాది కూడా వన్డేల్లో పరుగుల వరద పారించినందుకు గానూ ధోనికి మరోసారి ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు లభించింది. 

2009లో భారత ప్రభుత్వం ధోనికి పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. 2011లో ధోనికి భారత సైన్యంలో  లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ హోదా లభించింది. అదే ఏడాది సీఎన్‌ఎన్‌-న్యూస్‌ 18 ఇండియన్‌ ఆఫ్‌ ద ఇయర్‌, క్యాస్ట్రాల్‌ ఇండియన్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డులు లభించాయి. 2011-2020 దశాబ్దానికి గానూ ధోనికి ఐసీసీ స్పిరిట్‌ ఆఫ్‌ ద క్రికెట్‌ అవార్డు లభించింది.

2018లో ధోని భారత దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్‌ అవార్డు అందుకున్నాడు. తాజాగా ధోనిని ఐసీసీ తమ అత్యున్నత పురస్కారమైన హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌తో సత్కరించింది. ఇవే కాకుండా ధోని కెరీర్‌లో ఎన్నో ప్రైవేట్‌ పురస్కారాలు అందుకున్నాడు. 43 ఏళ్ల ధోని 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి, ప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement