
లంక ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్ నుంచి కొలొంబో స్ట్రయికర్స్ నిష్క్రమించింది. నిన్న (జులై 18) క్యాండీ ఫాల్కన్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ఈ జట్టు 2 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసి 159 పరుగులు చేసిన కొలొంబో.. స్వల్ప స్కోర్ను కాపాడుకోవడంలో విఫలమైంది. కమిందు మెండిస్ (54), దుసన్ షనక (39) అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడి ఫాల్కన్స్ను గెలిపించారు.
రాణించిన సమరవిక్రమ
సమరవిక్రమ (62) అర్ద సెంచరీతో రాణించడంతో కొలొంబో గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. కొలొంబో ఇన్నింగ్స్లో గుర్బాజ్ (30), వెల్లలగే (28) ఓ మోస్తరు స్కోర్లు చేయగలిగారు. ఫాల్కన్స్ బౌలర్లలో హస్నైన్ 3, హసరంగ 2, ఏంజెలో మాథ్యూస్, షనక తలో వికెట్ పడగొట్టారు.
160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఫాల్కన్స్.. కమిందు మెండిస్, షనక సత్తా చాటడంతో 18.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. కొలొంబో బౌలర్లలో బినర ఫెర్నాండో, మతీష పతిరణ తలో 3, ఇషిత విజేసుందర, షాదాబ్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్లో గెలుపొందిన ఫాల్కన్స్.. రేపు జరుగబోయే ఎలిమినేటర్ 2లో జాఫ్నా కింగ్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు జులై 21న జరిగే ఫైనల్లో గాలే మార్వెల్స్తో అమీతుమీ తేల్చుకుంటుంది.