
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. బ్యాటింగ్ పరంగా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాయి. మొదటి ఇన్నింగ్స్లో భారత్ 471 పరుగులు చేస్తే.. ఇంగ్లండ్ అందుకు సమాధానంగా 465 పరుగులు చేసింది. భారత్కు కేవలం 6 పరుగులు మాత్రమే ఆధిక్యం లభించింది.
మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(47), శుబ్మన్ గిల్ ఉన్నారు. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్నందున ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించక తప్పదు. అది జరగాలంటే భారత్ నాలుగో రోజు మొత్తం బ్యాటింగ్ చేయాలి.
క్రీజులో పాతుకుపోయిన కేఎల్ రాహుల్ నుంచి భారీ ఇన్నింగ్స్ను భారత అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్పై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. రాహుల్లో అద్బుతమైన టాలెంట్ ఉందని అతడు కొనియాడాడు.
"కేఎల్ రాహుల్ టోటల్ టీమ్ మ్యాన్. జట్టుకు ఏ అవసరమున్న తను ముందుకు వస్తాడు. ఏ స్ధానంలోనైనా బ్యాటింగ్ చేయగలడు. ఓపెనర్గా, మిడిలార్డర్లో ఎక్కడైనా బ్యాటింగ్ చేసే సత్తా అతడికి ఉంది. అంతేకాకుండా వికెట్ కీపర్గా కూడా రాణించలగడు. పరిస్థితులకు తగ్గట్టు ఆడే టాలెంట్ అతడి వద్ద ఉంది.
ఎటువంటి పరిస్థితులలోనైనా రాహుల్ చాలా ప్రశాంతంగా కన్పిస్తాడు. ప్రస్తుత తరంలో ఇటువంటి క్రికెటర్లు చాలా అరుదుగా ఉంటారు. అతడు ఏదైనా సాధించినప్పుడు సెలబ్రేషన్స్ కూడా పెద్దగా చేసుకోడు. నిజంగా అతడు చాలా గ్రేట్. రాహుల్లో అద్బుతమైన టాలెంట్ ఉంది.
ఈ మ్యాచ్లో ఆఫ్సైడ్, లెగ్-సైడ్, ఫ్లిక్ వంటి మాస్టర్ క్లాస్ షాట్లు ఆడాడు. అతడి ఆట చూడటానికి చాలా అందంగా అనిపించింది. ఈ సిరీస్లో రాహుల్ బాగా రాణిస్తున్నాడన్న నమ్మకం నాకుంది. 5 టెస్టుల్లో కనీసం 700 పరుగులైనా చేస్తాడని" గవాస్కర్ జోస్యం చెప్పాడు.
చదవండి: అతడిపై నమ్మకం లేనపుడు.. ఎందుకు ఎంపిక చేశారు?: భారత మాజీ క్రికెటర్