
టీమిండియా నాయకత్వ బృందం తీరుపై భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra)విమర్శలు గుప్పించాడు. ఇంగ్లండ్తో తొలి టెస్టులో శార్దూల్ ఠాకూర్ (Sahrdul Thakur) పట్ల యాజమాన్యం వ్యవహరించిన తీరు సరికాదన్నాడు. అతడి సేవలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోనపుడు తుది జట్టులోకి ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించాడు.
మొదటి ఇన్నింగ్స్లో 471 పరుగులు
కాగా టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీ (Tedulkar-Anderson Trophy)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య లీడ్స్ వేదికగా శుక్రవారం తొలి టెస్టు మొదలైంది. హెడింగ్లీ మైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. మొదటి ఇన్నింగ్స్లో 471 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
భారత బ్యాటర్లలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101), కెప్టెన్ శుబ్మన్ గిల్ (147), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (134) శతకాలతో రాణించారు. ఈ క్రమంలో ఆతిథ్య ఇంగ్లండ్ సైతం భారత్కు దీటుగా బదులిచ్చింది. తొలి ఇన్నింగ్స్లో 465 పరుగులు సాధించింది.
బుమ్రాకు ఐదు వికెట్లు
ఓపెనర్ బెన్ డకెట్ హాఫ్ సెంచరీ(62) చేయగా.. వన్డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ (106) శతక్కొట్టాడు. మిగతా వాళ్లలో హ్యారీ బ్రూక్ (99) రాణించాడు. ఇక ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్లో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా 24.4 ఓవర్లు బౌల్ చేసి ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ 20 ఓవర్లు వేసి మూడు, మహ్మద్ సిరాజ్ 27 ఓవర్లు బౌల్ చేసి రెండు వికెట్లు దక్కించుకున్నారు.
ఇక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 23 ఓవర్లు బౌలింగ్ చేసినా వికెట్ తీయలేకపోయాడు. అయితే, ఈ ఇన్నింగ్స్లో సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్కు మాత్రం కేవలం ఆరు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసే అవకాశం లభించింది. కేవలం ఆరు ఓవర్లలోనే అతడు 38 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత కెప్టెన్ శుబ్మన్ గిల్ మళీ శార్దూల్ చేతికి బంతిని ఇవ్వలేదు.
నమ్మకం లేనపుడు జట్టులో ఎందుకు?
ఈ విషయం గురించి మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. గిల్ తీరును ప్రశ్నించాడు. ‘‘శార్దూల్ ఠాకూర్ సేవలను పూర్తి స్థాయిలో ఎందుకు వినియోగించుకోలేదు. అతడిని తుదిజట్టుకు ఎంపిక చేశారు. కొన్ని ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం ఇచ్చారు.
అయితే, అతడు ధారాళంగానే పరుగులు సమర్పించుకున్నాడు. అయినప్పటికీ అతడికి లాంగ్ స్పెల్స్ వేసే అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది. జట్టులోని ప్రతి బౌలర్ దాదాపు 20 ఓవర్లకు పైగానే బౌల్ చేశారు. కానీ శార్దూల్ మాత్రం సింగిల్ డిజిట్ వద్దే ఆగిపోయాడు.
మొదటిసారి, రెండోసారి కొత్త బంతి పాతబడిన తర్వాత కూడా అతడికి ఛాన్స్ రాలేదు. నాయకత్వ బృందం అతడిపై నమ్మకం ఉంచలేదు. మరి అలాంటపుడు అతడిని ఎందుకు ఎంపిక చేసినట్లు?’’ అని ఆకాశ్ చోప్రా టీమిండియా యాజమాన్యం తీరును విమర్శించాడు.
కాగా ఓవరల్గా 100.4 ఓవర్లు బౌలింగ్ చేసి.. మూడోరోజు ఆటలో భాగంగా 465 పరుగులకు ఇంగ్లండ్ను ఆలౌట్ చేసింది. అనంతరం.. ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన గిల్ సేన.. ఆదివారం నాటి ఆట పూర్తయ్యేసరికి 23.5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది.
ఇంగ్లండ్తో తొలి టెస్టుకు భారత తుదిజట్టు
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.
చదవండి: IND vs ENG: దిగ్గజ క్రికెటర్ కన్నుమూత.. నివాళులర్పించిన ఇంగ్లండ్-భారత్ ఆటగాళ్లు