
ఇంగ్లండ్ పర్యటనను టీమిండియా వెటరన్ ఆటగాడు కరుణ్ నాయర్ ఘనంగా ఆరంభించాడు. కాంటర్బరీ వేదికగా ఇంగ్లండ్ లయన్స్తో జరుగుతున్న తొలి అనాధికారిక-ఎ టెస్టులో కరుణ్ నాయర్.. భారత-ఎ జట్టు తరపున అద్బుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు.
ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన నాయర్.. 272 బంతుల్లో తన డబుల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్లో ఇప్పటివరకు 26 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఓవరాల్గా 204 పరుగులు చేసి ఔటయ్యాడు. నాయర్కు ఇది నాలుగో ఫస్ట్ క్లాస్ ద్విశతకం కావడం గమనార్హం.
కోహ్లి వారసుడు ఫిక్స్..?
కాగా విరాట్ కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించడంతో టెస్టుల్లో అతడి స్దానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న చర్చ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో నడుస్తోంది. కొంతమంది సాయిసుదర్శన్ పేరును సూచిస్తుంటే.. మరి కొంతమంది కరుణ్ నాయర్ను పేరును చెబుతున్నారు.
ఇటువంటి సమయంలో కోహ్లి స్ధానానికి తనే సరైనోడనని నాయర్ డబుల్ సెంచరీతో చాటుకున్నాడు. కాగా కరుణ్ నాయర్ 8 ఏళ్ల తర్వాత భారత టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. దేశవాళీ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన చేస్తుండడంతో నాయర్కు సెలక్టర్లు తిరిగి పిలుపునిచ్చారు. నాయర్ ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు.
రంజీ ట్రోఫీ 2024-25లో విదర్భ ఛాంపియన్గా నిలవడంలో కరుణ్ది కీలక పాత్ర. ఈ టోర్నీలో 16 ఇన్నింగ్స్లలో 53.93 సగటుతో 863 పరుగులు చేసి నాలుగో టాప్ స్కోరర్గా నిలిచాడు. నాయర్ చివరసారిగా భారత జట్టు తరపున 2017లో ఆడాడు. కాగా వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక భారత ఆటగాడిగా కరుణ్ నాయర్ కొనసాగుతున్నాడు.
భారీ స్కోర్ దిశగా భారత్-ఎ
ఇక అనాధికరిక టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్-ఎ జట్టు భారీ స్కోర్ దిశగా దూసుకువెళ్తోంది. 112 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 510 పరుగులు చేసింది. భారత బ్యాటర్లు సర్ఫరాజ్ ఖాన్(92), ధ్రువ్ జురెల్(94) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయారు.