‘పదేళ్లుగా అదే మాట వింటున్నా’ | Jasprit Bumrah finished with five for 83 in the first innings against England | Sakshi
Sakshi News home page

‘పదేళ్లుగా అదే మాట వింటున్నా’

Jun 24 2025 4:49 AM | Updated on Jun 24 2025 4:50 AM

Jasprit Bumrah finished with five for 83 in the first innings against England

తన పనైపోయిందన్న విమర్శలకు బుమ్రా సమాధానం

మరిన్ని మ్యాచ్‌లు గెలిపించడమే లక్ష్యమన్న పేసర్‌  

లీడ్స్‌: భారత స్టార్‌ పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌లో దాదాపు పదేళ్లుగా ఉన్నాడు. ఐపీఎల్‌లో పుష్కర కాలం పూర్తి చేసుకున్నాడు. అయితే కెరీర్‌ ఆరంభం నుంచి అతని భిన్నమైన బౌలింగ్‌ శైలిపై ఎన్నో చర్చలు సాగాయి. ఈ తరహా యాక్షన్‌తో ఎక్కువ కాలం కొనసాగలేడని, సుదీర్ఘ కెరీర్‌ సాగడం కష్టమని చాలా మంది అభిప్రాయపడ్డారు. పైగా గాయాలతో ఆటకు దూరం కాగానే ఇంతటితో కెరీర్‌ ముగిసినట్లే అనే విమర్శలు వినిపించాయి. 

కానీ బుమ్రా వాటన్నింటినీ పట్టించుకోలేదు. అద్భుత ప్రదర్శనలతో భారత్‌కు చిరస్మరణీయ విజయాలు అందించి ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా ఎదిగాడు. బరిలోకి దిగిన ప్రతీసారి కొత్త రికార్డులు తన ఖాతాలో వేసుకుంటున్నాడు. తాజాగా ఇంగ్లండ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన తర్వాత అతను ఈ విషయాలపై స్పందించాడు. ‘నేను ఎప్పుడైనా భారత్‌కు ఆడాలని బలంగా కోరుకున్నా. 

నాపై నాకున్న నమ్మకం వల్లే అన్ని ఫార్మాట్‌లలో ఆడగలిగా. కానే వేరేవాళ్లు ఎవరూ దానిని నమ్మలేదు. నువ్వు అసలు ఎప్పుడూ ఆడలేవు అని మొదట్లో అనేవారు. ఆ తర్వాత ఆరు నెలలు, ఆపై ఎనిమిది నెలలు ఆడితే గొప్ప అనేవారు. కానీ ఇప్పుడు భారత్‌ తరఫున దాదాపు పదేళ్లు ఆడితే ఐపీఎల్‌లో మరో మూడేళ్లు అదనంగా ఆడాను. ఇప్పుడు కూడా ఒక గాయం కాగానే నా పనైపోయిందని వెంటనే అనేస్తారు. ప్రతీ మూడు–నాలుగు నెలలకు ఇవే మాటలు వస్తాయి. 

నేను ఇవేమీ పట్టించుకోను. నా పని నేను చేస్తూ పోతా. భారత జట్టును గెలిపించేందుకు ప్రయత్నిస్తా. ఆపై దేవుడు నాకు ఏది రాసిపెట్టి ఉంటే అది జరుగుతుంది’ అని బుమ్రా వ్యాఖ్యానించాడు. బుమ్రా ఫిట్‌నెస్, పనిభారాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అతను మూడు టెస్టులే ఆడతాడని కోచ్‌ గంభీర్‌ ప్రకటించాడు. అయితే ఇదే విషయంపై బుమ్రా కాస్త భిన్నంగా స్పందించాడు. తాను మూడు టెస్టులే ఆడతానా లేదా అనేదానిపై అతను స్పష్టతనివ్వలేదు. 

‘మున్ముందు ఏం జరగవచ్చనే విషయంపై ఆలోచించడం అనవసరం. ప్రస్తుతం మైదానంలో ఏం జరుగుతోంది అనే దానిపైనే నా దృష్టి ఉంది. నేను పూర్తి చేయాల్సి పని ఉంది. పిచ్‌ ఎలా స్పందిస్తోంది, వికెట్‌ ఎలా తీయాలి, ఏ బ్యాటర్‌కు ఎలా బౌలింగ్‌ చేయాలి అనే అంశాలపైనే నేను ఆలోచిస్తున్నాను. అంతే తప్ప ఎన్ని టెస్టులు ఆడతానని కాదు. ఒక్కసారి మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఈ లెక్కలన్నీ చూసుకోవచ్చు. రాత్రయ్యాక ఈ రోజు నేను నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చానని భావిస్తే ప్రశాంతంగా పడుకుంటా’ అని బుమ్రా వివరించాడు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement