
అభిమాన్యు ఈశ్వరన్.. దురదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో టన్నుల కొద్దీ పరుగులు సాధిస్తున్నప్పటకి.. ఈ బెంగాల్ క్రికెటర్ ఇప్పటివరకు భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయలేకపోయాడు. అతడి కంటే ఎన్నో ఏళ్లు వెనుక కెరీర్ మొదలు పెట్టిన ఆటగాళ్లు టీమిండియాకు ప్రాతనిథ్యం వహిస్తుంటే.. ఈశ్వరన్ కేవలం రిజర్వ్ ప్లేయర్గానే మిగిలుపోతున్నాడు. ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన ఈశ్వరన్.. తొలి టెస్టులో అరంగేట్రం చేస్తాడని భావించారు.
కానీ టీమ్ మెనెజ్మెంట్ మాత్రం మరోసారి అతడికి మొండి చేయి చూపించింది. అతడి స్ధానంలో తమిళనాడుకు చెందిన సాయిసుదర్శన్కు గంభీర్ అండ్ కెప్టెన్ గిల్ ఛాన్స్ ఇచ్చారు. ఇప్పటికి ఈశ్వరన్ మూడు సార్లు భారత జట్టుకు ఎంపికైనప్పటికి అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు. అదే సాయి సుదర్శన్ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. సుదర్శన్ భారత టెస్టు జట్టుకు ఎంపికైన తొలిసారే డెబ్యూ చేసే అవకాశం వచ్చింది.
రంజీల్లో ఆడితే సరిపోదు..!
తుది జట్టులో ఈశ్వరన్కు చోటుదక్కపోవడంతో భారత జట్టు మెనెజ్మెంట్పై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కాదు, ఐపీఎల్లో బాగా రాణిస్తేనే టీమిండియా తరపున ఆడే అవకాశం లభిస్తుందని సెటైర్లు వేస్తున్నారు.
అది మరోసారి రుజువైందని సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. సాయిసుదర్శన్కు కెప్టెన్ శుబ్మన్ గిల్ సపోర్ట్ ఉందని, ఈశ్వరన్కు ఎవరి మద్దతు లేకపోవడంతో ఛాన్స్ లభించడం లేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
కాగా ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు గిల్, సాయిసుదర్శన్ కలసి ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇక అభిమన్యు ఇప్పటివరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 101 మ్యాచ్లు ఆడి 53.63 సగటుతో 7841 పరుగులు చేశాడు. అతడి కెరీర్లో 27 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
అరంగేట్రంలో ఫెయిల్..
ఇక అభిమాన్యు స్ధానంలో చోటు దక్కించుకున్న సాయిసుదర్శన్ తన అరంగేట్రంలో దారుణ ప్రదర్శన కనబరిచాడు. లీడ్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 4 బంతులు ఆడి డకౌట్గా పెవిలియన్కు చేరాడు. స్టోక్స్ బౌలింగ్లో వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి సుదర్శన్ ఔటయ్యాడు.
అయితే ఈ మ్యాచ్ పక్కన పెడితే.. అయితే సాయిసుదర్శన్ సైతం మంచి ఫామ్లో ఉన్నాడు. ఇటీవలే జరిగిన ఐపీఎల్-2025లో అత్యధిక పరుగులు వీరుడిగా సుదర్శరన్ నిలిచాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సుదర్శన్ మెరుగ్గా రాణిస్తున్నాడు.
29 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన సుదర్శన్.. 39.93 సగటుతో 1957 పరుగులు చేశాడు. అందులో 7 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ అనుభవం దృష్ట్యా ఈశ్వరన్కు ఛాన్స్ ఇవ్వాల్సందని క్రికెట్ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.
తుది జట్లు
భారత్
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.
ఇంగ్లండ్
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్.
చదవండి: చరిత్ర సృష్టించిన శుబ్మన్ గిల్.. ఈ శతాబ్దంలో ఒకే ఒక్కడు!