
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇవాళ (ఏప్రిల్ 20) రాత్రి జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే శివమ్ దూబే (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రవీంద్ర జడేజా (35 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు,2 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.
సీఎస్కే ఇన్నింగ్స్లో అరంగేట్రం ఆటగాడు ఆయుశ్ మాత్రే (15 బంతుల్లో 32; 4 ఫోర్లు,2 సిక్సర్లు) కూడా సత్తా చాటాడు. షేక్ రషీద్ 20 బంతుల్లో 19, రచిన్ రవీంద్ర 9 బంతుల్లో 5, ధోని 6 బంతుల్లో 6 పరుగులు చేసి ఔటయ్యారు. ముంబై బౌలర్లలో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీయగా.. దీపక్ చాహర్, అశ్వనీ కుమార్, సాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం ఛేదనకు దిగిన ముంబై రోహిత్ శర్మ (45 బంతుల్లో 76 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో 15.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. స్కై వరుసగా రెండు సిక్సర్లు కొట్టి మ్యాచ్ను ముగించాడు.
ఈ మ్యాచ్లో ఆది నుంచే దూకుడుగా ఆడిన రోహిత్ శర్మ సీజన్లో తొలిసారి సామర్థ్యం మేరకు సత్తా చాటాడు. ముంబై ఇన్నింగ్స్లో రికెల్టన్ (19 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్) కూడా పర్వాలేదనిపించాడు. సీఎస్కే బౌలర్లలో రవీంద్ర జడేజాకు వికెట్ దక్కింది. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది.
