
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 30) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ముంబై రెండో క్వాలిఫయర్కు అర్హత సాధించగా.. గుజరాత్ ఇంటిబాట పట్టింది.
ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. రోహిత్ శర్మ (81), బెయిర్స్టో (47), సూర్యకుమార్ యాదవ్ (33), తిలక్ వర్మ (25) ఇరగదీయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది.
ఆఖరి ఓవర్లో హార్దిక్ పాండ్యా (21 నాటౌట్) బ్యాట్ ఝులిపించాడు. మూడు సిక్సర్లు బాదాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, సాయికిషోర్ తలో రెండు వికెట్లు తీయగా.. సిరాజ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ ముంబై ఇండియన్స్ గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది. ముఖ్యంగా సాయి సుదర్శన్ (80) ఆకాశమే హద్దుగా చెలరేగి ముంబై ఇండియన్స్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. సాయి క్రీజ్లో ఉన్నంత సేపు మ్యాచ్ గుజరాత్ చేతుల్లో ఉండింది.
అయితే సాయి ఔటయ్యాక పరిస్థితి మెల్లగా చేజారుతూ వచ్చింది. చివరి ఓవర్ వరకు పోరాడినా గుజరాత్కు విజయం దక్కలేదు. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేయగలిగింది. గుజరాత్ ఇన్నింగ్స్లో సాయి సుదర్శన్తో పాటు వాషింగ్టన్ సుందర్ (48) రాణించాడు.
శుభ్మన్ గిల్ ఒక్క పరుగుకే ఔట్ కాగా.. రూథర్ఫోర్డ్ 24, తెవాతియా 16 (నాటౌట్), షారుఖ్ ఖాన్ 13 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో బౌల్ట్ 2, బుమ్రా, గ్లీసన్, సాంట్నర్, అశ్వనీ కుమార్ తలో వికెట్ పడగొట్టారు. ముంబై ఇండియన్స్ జూన్ 1న జరిగే క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఆ మ్యాచ్లో గెలిచిన జట్టు జూన్ 3న జరిగే ఫైనల్లో ఆర్సీబీని ఢీకొంటుంది.