కేకేఆర్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా? | Hardik Pandya May-Lead KKR-In IPL 2027-Transfer Buzz-Intresting | Sakshi
Sakshi News home page

కేకేఆర్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా?

Jun 24 2026 11:14 AM | Updated on Jun 24 2026 11:33 AM

Hardik Pandya May-Lead KKR-In IPL 2027-Transfer Buzz-Intresting

Credit: AI Generated

టీమిండియా ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా వ‌చ్చే ఏడాది ఐపీఎల్‌లో కేకేఆర్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో కెప్టెన్‌గా, ఆట‌గాడిగా దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన పాండ్యాను ముంబై ఇండియ‌న్స్‌ రిలీజ్ చేయ‌నున్నట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలోనే కేకేఆర్ యాజ‌మాన్యం ఇప్ప‌టికే హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ విష‌య‌మై ముంబై యాజమాన్యంతో చాలాసార్లు చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. 

ఒకవేళ హార్దిక్ పాండ్యా నగదు ఒప్పందం లేదా ఆటగాళ్ల మార్పిడి ద్వారా కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు వెళ్తే, అతనికి ఆ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ప్రస్తుతం కేకేఆర్ జట్టుకు రింకూ సింగ్ సరైన నాయకత్వ ప్రత్యామ్నాయంగా కనిపించడం లేదు. మరోవైపు పాండ్యాను సొంతం చేసుకునేందుకు రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కూడా ముంబై ఇండియ‌న్స్‌కు ట్రేడింగ్ ప్ర‌తిపాదన పంపిన‌ట్లు స‌మాచారం. 

అందులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, హార్దిక్ పాండ్యా మధ్య ఆటగాళ్ల మార్పిడి జరిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ చర్చలు ఎంతవరకు ముందుకు సాగాయనే దానిపై స్పష్టత లేదు. రాజస్థాన్ రాయల్స్ మాత్రం ప్ర‌స్తుత కెప్టెన్ రియాన్ ప‌రాగ్‌ను దీర్ఘకాలిక కెప్టెన్‌గా కొన‌సాగించాల‌ని భావిస్తోంది. అందువల్ల రాజస్థాన్ రాయ‌ల్స్‌కు పాండ్యా కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌డం క‌ష్ట‌మే. 

ఈ సమీకరణాల దృష్ట్యా హార్దిక్ పాండ్యాకు రాజస్థాన్ రాయల్స్ కంటే కోల్కతా నైట్ రైడర్స్ జట్టులోకి వెళ్లడమే అత్యుత్తమ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఆటగాడు నేరుగా వేరే జట్టుతో చర్చలు జరపకూడదు. కేవలం ఫ్రాంచైజీల మధ్య సంప్రదింపులు జరగాలి. అయితే ఆటగాడి అంగీకారం లేకుండా ట్రేడింగ్ సాధ్యం కాదు. 

ఒకవేళ ఆటగాడు నిరాకరిస్తే అతడిని వేలంలోకి వ‌ద‌లాల్సి ఉంటుంది. ఒక‌వేళ కేకేఆర్‌లోకి పాండ్యా వ‌స్తే మాత్రం ర‌హానే కెప్టెన్సీ వ‌దులుకోవాల్సి ఉంటుంది. కేకేఆర్ కూడా ర‌హానే త‌మ తాత్కాలిక కెప్టెన్ మాత్ర‌మే అని ప‌లు సంద‌ర్భాల్లో చెప్పుకొచ్చింది. ఐపీఎల్‌ 2026 సీజన్‌ చివర్లో వెన్నునొప్పికి గురైన పాండ్యా అప్పటి నుంచి బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ శిబిరంలో చికిత్స పొందుతున్నాడు. 

మొదట గాయం నుంచి కోలుకుని ఫిట్‌నెస్‌ సాధించిన పాండ్యాను బీసీసీఐ తొలుత ఇంగ్లండ్‌ సిరీస్‌కు ఎంపిక చేసింది. అయితే తొడ కండరాల గాయం తిరగబెట్టడంతో పాండ్యా ఇంగ్లండ్‌ సిరీస్‌కు దూరమైనట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అతడి స్థానంలో నితీశ్‌కుమార్‌ రెడ్డిని ఎంపిక చేయగా, అతడు కూడా గాయపడడంతో లంకలో జరిగిన ట్రై సిరీస్‌లో ఇండియా-ఏ తరఫున అదరగొట్టిన సూర్యాన్ష్‌ హెగ్డెను ఎంపిక చేసింది. 

 

చదవండి: మాజీ క్రికెట‌ర్ షోయబ్‌ అక్త‌ర్ ఇంట్లో విషాదం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement