క్లీన్‌స్వీప్‌పై భారత్‌ దృష్టి | Indias final ODI against Afghanistan today | Sakshi
Sakshi News home page

క్లీన్‌స్వీప్‌పై భారత్‌ దృష్టి

Jun 20 2026 4:07 AM | Updated on Jun 20 2026 4:07 AM

Indias final ODI against Afghanistan today

నేడు అఫ్గానిస్తాన్‌తో చివరి వన్డే 

మ.గం.1:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లలో ప్రసారం

చెన్నై: సొంతగడ్డపై అఫ్గానిస్తాన్‌ను ఏకైక టెస్టులో చిత్తుగా ఓడించిన భారత జట్టు ఆపై వరుసగా రెండు వన్డేల్లో కూడా ప్రత్యర్థిపై చెలరేగింది. ఇప్పటికే వన్డే సిరీస్‌ సొంతం చేసుకున్న టీమ్‌ మరో మ్యాచ్‌నూ గెలిచి క్లీన్‌స్వీప్‌ చేయాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో సిరీస్‌తో చివరిదైన మూడో వన్డేకు నేడు చెపాక్‌ మైదానం సిద్ధమైంది. సగం ఓవర్లే సాగిన తొలి మ్యాచ్‌లో, పూర్తి మ్యాచ్‌ జరిగిన గత మ్యాచ్‌లో కూడా టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం కొనసాగింది. గత మ్యాచ్‌లో గిల్, ఇషాన్‌ల శతకాలతో జట్టు 400కు పైగా స్కోరు నమోదు చేసింది. 

రాహుల్, శ్రేయస్‌ చెప్పుకోదగ్గ స్కోర్లు సాధించాల్సి ఉంది. రెండో వన్డేలో విఫలమైనా... జైస్వాల్‌కు మరో అవకాశం దక్కనుంది. లక్నో వన్డేలో ధాటిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించిన రోహిత్‌ దానిని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. ఇక్కడ కూడా అతను తన జోరు కొనసాగించాలని జట్టు ఆశిస్తోంది. బౌలింగ్‌లో కూడా భారత్‌కు ఎలాంటి సమస్యా లేదు. ఈ సిరీస్‌తో అరంగేట్రం చేసిన కొత్త ఆటగాళ్లు గుర్నూర్, ప్రిన్స్, హర్ష్ దూబే తమకు లభించిన అవకాశాన్ని సమర్థంగా వాడుకున్నారు. 

అర్ష్ దీప్‌ ఫర్వాలేదనిపించగా, కుల్దీప్‌ మాత్రం గత వన్డేలో ప్రభావం చూపలేదు. గాయంతో రెండో వన్డేకు దూరమైన నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం ఖాయమైంది. మరో వైపు అఫ్గానిస్తాన్‌ పరిస్థితి మాత్రం పేలవంగా కనిపిస్తోంది. గుర్బాజ్‌ రెండు మ్యాచ్‌లలో చెలరేగినా జట్టుకు కావాల్సిన ఫలితం దక్కకపోగా, టాప్‌ స్పిన్నర్‌ రషీద్‌ కూడా భారత్‌ను నిలువరించలేకపోయాడు.  చెన్నై పిచ్‌పై అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌కు సమాన అవకాశాలు ఉన్నాయి.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement