
స్వర్ణ పతకాలతో మెరిసిన భారత షూటర్లు సురుచి, విజయ్వీర్
బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ టోర్నమెంట్లో మంగళవారం భారత షూటర్లు అదరగొట్టారు. రెండు స్వర్ణ పతకాలతో సత్తా చాటుకున్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 18 ఏళ్ల సురుచి ఇందర్ సింగ్... పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో విజయ్వీర్ సిద్ధూ పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో సురుచి 244.6 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
సురుచి ధాటికి చైనా ద్వయం కియాన్ వె 241.9 పాయింట్లతో రజతం దక్కించుకోగా... డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ జియాంగ్ రాన్జిన్ 221 పాయింట్లతో కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. 41 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్లోనూ సురుచి తన ఆధిపత్యం చాటుకుంది. సురుచి 583 పాయింట్లు స్కోరు చేసి టాప్ ర్యాంక్లో నిలిచింది.
భారత స్టార్ షూటర్, పారిస్ ఒలింపిక్స్లో రెండు కాంస్య పతకాలు నెగ్గిన మనూ భాకర్ నిరాశపరిచింది. మనూ 574 పాయింట్లు స్కోరు చేసి 13వ స్థానంతో సంతృప్తి పడి ఫైనల్కు అర్హత సాధించడంలో విఫలమైంది. భారత్కే చెందిన మరో షూటర్ సయం 572 పాయింట్లతో 17వ స్థానంలో నిలిచింది.
ఆరుగురు షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో విజయ్వీర్ సిద్ధూ 29 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. ప్రపంచకప్ చరిత్రలో 22 ఏళ్ల విజయ్వీర్ వ్యక్తిగత విభాగంలో పసిడి పతకం గెలవడం ఇదే తొలిసారి. రికియార్డో మజెట్టి (ఇటలీ; 28 పాయింట్లు) రజతం నెగ్గగా... యాంగ్ యుహావో (చైనా; 23 పాయింట్లు) కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు.
24 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్ ఈవెంట్లో విజయ్వీర్ 579 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించాడు. భారత్కే చెందిన గుర్ప్రీత్ సింగ్ 575 పాయింట్లతో 10వ స్థానంలో, అనీశ్ 570 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచారు. ప్రస్తుతం భారత్ 4 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యంతో కలిపి మొత్తం 6 పతకాలతో అగ్రస్థానంలో ఉంది.