శ్రీలంక పర్యటనలో వన్డే ట్రై-నేషన్ సిరీస్ను విజయవంతంగా ముగించిన భారత్-ఏ జట్టు ఇప్పుడు రెడ్బాల్ క్రికెట్పై దృష్టి సారించింది. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య తొలి నాలుగు రోజుల అనధికారిక టెస్టు మ్యాచ్ రేపటి నుంచి (జూన్ 25) గాలే అంతర్జాతీయ స్టేడియం వేదికగా ప్రారంభం కానుంది.
భారత్-ఏ జట్టుకు వికెట్కీపర్-బ్యాటర్ ధృవ్ జురెల్ నాయకత్వం వహిస్తున్నాడు. ఇటీవల దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న జురెల్కు ఇది కెప్టెన్గా కీలక అవకాశం. జట్టు వైస్ కెప్టెన్గా దేవదత్ పడిక్కల్ వ్యవహరించనున్నాడు.
ఇటీవల ముగిసిన ట్రై-నేషన్ ‘ఏ’ సిరీస్లో భారత్-ఏ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఫైనల్లో శ్రీలంక-ఏను 66 పరుగుల తేడాతో ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఆ విజయంతో జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇప్పుడు అదే జోరును నాలుగు రోజుల ఫార్మాట్లో కొనసాగించాలని భారత్-ఏ లక్ష్యంగా పెట్టుకుంది.
గాలే పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉండటంతో బ్యాటర్లకు ఇది కఠిన పరీక్షగా మారే అవకాశం ఉంది. మరోవైపు స్వదేశంలో ఆడుతున్న శ్రీలంక-ఏ జట్టు కూడా ప్రతిఘటన చూపేందుకు సిద్ధమవుతోంది.
తొలి మ్యాచ్ రేపటి నుంచి 28 వరకు జరుగుతుండగా, రెండో మ్యాచ్ జూలై 2 నుంచి 5 వరకు గాలే వేదికగానే నిర్వహించబడుతుంది.
జట్ల వివరాలు..
భారత ఏ జట్టు: సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, అమన్ మోఖడే, ఆయుశ్ పాండే, షేక్ రషీద్, రుతురాజ్ గైక్వాడ్, హర్షిత్ దూబే, అన్షుల్ కంబోజ్, సరాన్ష్ జైన్, ఆకిబ్ నబీ దార్, ధృవ్ జురెల్, ఎన్ జగదీశన్, గుర్నూర్ బ్రార్, యశ్ ఠాకూర్, జీషన్ అన్సారీ
శ్రీలంక ఏ జట్టు: నువనిదు ఫెర్నాండో, అషెన్ బండార, అహాన్ విక్రమసింఘే, అసంక మనోజ్, పవంత వీరసింఘే, సహాన్ అరచ్చిగే (కెప్టెన్), రవిందు ఫెర్నాండో, దిలుమ్ సుదీర, ప్రవీణ్ మనీషా, కేషారా నువంత, సోహన్ డి లివేరా, నిరోషన్ డిక్వెల్లా, కవిందు పతిరత్నే, మొహమ్మద్ షిరాజ్, చమిక గుణశేఖర, దులాజ్ సముదిత,


