గాలె: యువ ఆటగాళ్లతో నిండిన భారత ‘ఎ’ జట్టు... గురువారం నుంచి శ్రీలంక ‘ఎ’ జట్టుతో రెండో అనధికారిక టెస్టు మ్యాచ్ ఆడనుంది. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరిగిన తొలి టెస్టు ‘డ్రా’గా ముగియగా... భారత జట్టు నుంచి ఓపెనర్ సాయి సుదర్శన్, ధ్రువ్ జురేల్ సెంచరీలు చేశారు. ఈ పర్యటనలో ముక్కోణపు వన్డే టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత ‘ఎ’జట్టు... సుదీర్ఘ ఫార్మాట్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. తొలి టెస్టు ‘డ్రా’ కావడంతో... నేటి నుంచి ప్రారంభం కానున్న నాలుగు రోజుల మ్యాచ్లో రాణించి సిరీస్ పట్టేయాలని చూస్తోంది.
యువ పేసర్లను తీర్చిదిద్దాలని భావిస్తున్న మేనేజ్మెంట్... ఇటీవల టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన గుర్నూర్ బ్రార్ను శ్రీలంక పిచ్లపై పరీక్షించనుంది. అతడితో పాటు అఫ్గానిస్తాన్తో ఏకైక టెస్టు ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన స్పిన్ ఆల్రౌండర్ మానవ్ సుతార్... తొలి మ్యాచ్లోనూ 10 వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం కౌంటీల్లో సైతం రాణించిన సుతార్... ఇప్పుడు భారత్ ‘ఎ’ తరఫున ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి.
హర్ష్ దూబేకు తుది జట్టులో చోటు కష్టమే. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన ప్లేయర్లలో పలువురు ఆటగాళ్లు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడంతో... ఆఖరి పోరులో జట్టు కూర్పు ఎలా ఉంటుందో చూడాలి. అమన్ మోఖడే, జీషన్ అన్సారీ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. గత మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన టీమిండియా ప్లేయర్ సాయి సుదర్శన్ పూర్తిగా కోలుకోకపోతే అతడి స్థానంలో అమన్ మోఖడే ఇన్నింగ్స్ ఆరంభించవచ్చు.


