సంయుక్త విజేతలుగా భారత్, బంగ్లాదేశ్‌  | India and Bangladesh are joint winners | Sakshi
Sakshi News home page

సంయుక్త విజేతలుగా భారత్, బంగ్లాదేశ్‌ 

Feb 9 2024 3:56 AM | Updated on Feb 9 2024 3:56 AM

India and Bangladesh are joint winners - Sakshi

ఢాకా: నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న దక్షిణాసియా అండర్‌–19 మహిళల ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ ఫైనల్లో భారత్, బంగ్లాదేశ్‌ జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా ముగిశాయి. అనంతరం విజేతను నిర్ణయించడానికి ‘షూటౌట్‌’ నిర్వహించారు.

‘షూటౌట్‌’లో రెండు జట్ల నుంచి గోల్‌కీపర్లతో సహా 11 మంది చొప్పున గోల్స్‌ చేయడంతో 11–11తో సమమైంది. ఈ దశలో ఫలితం తేలేవరకు ‘షూటౌట్‌’ను కొనసాగించాల్సి ఉండగా... టోర్నీ కమిషనర్‌ అనూహ్యంగా రెండు జట్ల కెపె్టన్‌లను పిలిచి, రిఫరీ సమక్షంలో ‘టాస్‌’ ద్వారా విజేతను నిర్ణయించారు.

‘టాస్‌’ నెగ్గడంతో టీమిండియా సంబరాలు చేసుకోగా... బంగ్లాదేశ్‌ బృందం మాత్రం ఈ ఫలితాన్ని నిరసిస్తూ మైదానంలోనే ఉండిపోయింది. గంటన్నర దాటినా వివాదం సద్దుమణగకపోవడంతో నిర్వాహకులు తమ నిర్ణయాన్ని మార్చుకొని చివరకు రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు.  

Advertisement
 
Advertisement
Advertisement