ఐర్లాండ్తో రెండో టీ20 మ్యాచ్లో టీమిండియా బౌలర్లు మెరుగ్గా రాణించారు. ప్రత్యర్థిని నామమాత్రపు స్కోరుకే పరిమితం చేయగలిగారు. కాగా రెండు టీ20 మ్యాచ్లు ఆడేందుకు భారత జట్టు ఐర్లాండ్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా బెల్ఫాస్ట్ వేదికగా తొలి టీ20లో శ్రేయస్ అయ్యర్ సేన అనూహ్య రీతిలో ఓటమి పాలైంది. ఆతిథ్య జట్టు చేతిలో 34 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో తాజాగా అదే వేదికపై మళ్లీ టాస్ గెలిచిన భారత్.. మరోసారి తొలుత బౌలింగ్నే ఎంచుకుంది.
హ్యారీ టెక్టార్ అర్ధ శతకం
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నమ్మకాన్ని నిజం చేస్తూ పేసర్ హర్షిత్ రాణా తొలి ఓవర్లోనే ఐరిష్ ఓపెనర్ టిమ్ టెక్టార్ (5)ను వెనక్కి పంపాడు. ఇక అర్ష్దీప్ సింగ్ మరో ఓపెనర్ రాస్ అడైర్ (16)ను పెవిలియన్కు చేర్చాడు. ఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్ హ్యారీ టెక్టార్ అర్ధ శతకం (53)తో రాణించగా.. బెంజమిన్ కాలిట్జ్ (37) అతడికి తోడుగా నిలబడ్డాడు.
మిగిలిన వారిలో గెరెత్ డెలానీ డకౌట్ కాగా.. కెప్టెన్ లోర్కాన్ టక్కర్ 15 జార్జ్ డాక్రెల్ 19 పరుగులు చేసి వెనుదిరిగారు. ఆఖరి ఓవర్లో ప్రిన్స్ యాదవ్ హ్యారీ టెక్టార్, లియామ్ మెక్కార్తీ (2)లను పెవిలియన్కు పంపాడు.
ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐర్లాండ్ ఎనిమిది వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. తద్వారా టీమిండియాకు 156 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఇకభారత బౌలర్లలో అరంగేట్ర పేసర్ ప్రిన్స్ యాదవ్ మూడు వికెట్లు తీయగా.. అర్ష్దీప్ సింగ్, శివం దూబే చెరో రెండు, హర్షిత్ రాణా ఒక వికెట్ పడగొట్టారు.


