
ఢాకా వేదికగా బంగ్లాదేశ్తో రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో బంగ్లాతో ఆఖరి వన్డేకు రోహిత్ దూరమయ్యాడు. ఇక గాయపడిన రోహిత్ గురువారం స్వదేశానికి తిరిగి రానున్నాడు. ఈ నేపథ్యంలో అతడు బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్కు కూడా దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.
దీంతో అతడి స్థానంలో భారత-ఎ జట్టు కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ని ప్రధాన జట్టుకు ఎంపిక చేయనున్నట్లు సమచారం. అభిమన్యు ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత-ఎ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. బంగ్లాతో జరుగుతోన్న అనధికారిక టెస్టు సిరీస్లో ఈశ్వరన్ వరుసగా రెండు సెంచరీలు సాధించాడు. తొలి టెస్టులో 141 పరుగులు చేసిన ఈశ్వరన్.. రెండో టెస్టులో 157 పరుగులతో రాణించాడు.
ఎవరీ అభిమన్యు ఈశ్వరన్?
ఉత్తరాఖండ్లోని తమిళియన్ కుటుంబంలో జన్మించిన అభిమన్యు ఈశ్వరన్.. దేశీవాళీ క్రికెట్లో బెంగాల్ జట్టు తరపున ఆడుతున్నాడు. 2013లో ఈశ్వరన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 77 మ్యాచ్లు ఆడిన ఈశ్వరన్ 5419 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో ఒక డబుల్ సెంచరీతో పాటు 17 సెంచరీలు, 23 అర్ధ శతకాలు ఉన్నాయి.
భారత టెస్టు జట్టులో చోటు..
బంగ్లాతో రెండో టెస్టు అనంతరం అభిమన్యు భారత టెస్టు జట్టుతో కలవనున్నాడు అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. “అభిమన్యు ఈశ్వరన్ ప్రస్తుతం జరుగుతన్న 'ఎ' టెస్టు సిరీస్లో వరుసగా రెండు సెంచరీలు సాధించాడు. అతడు ఓపెనర్గా అద్భుతంగా రాణిస్తున్నాడు. రెండో టెస్టు అనంతరం అతడు చటోగ్రామ్లో భారత జట్టుతో కలవనున్నాడు.
ఒక వేళ టెస్టు సిరీస్ సమయానికి రోహిత్ కోలుకోకపోతే ఈశ్వరన్ జట్టులోకి రానున్నాడు" అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. అదే విధంగా గాయం కారణంగా టెస్టు సిరీస్కు దూరమైన వెటరన్ పేసర్ మహ్మద్ షమీ స్థానంలో ఉమ్రాన్ మాలిక్ లేదా ముఖేష్ కుమార్కు చోటు దక్కే అవకాశం ఉంది. ఇక మూడో వన్డే ముగిసిన అనంతరం డిసెంబర్ 14 నుంచి భారత్-బంగ్లా మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది.
చదవండి: Ind A Vs Ban A: సెంచరీతో చెలరేగిన అభిమన్యు ఈశ్వరన్.. బంగ్లా బౌలర్లకు చుక్కలు