బంగ్లాతో తొలి టెస్ట్.. విజయానికి 4 వికెట్ల దూరంలో టీమిండియా
IND VS BAN 1st Test Day 4: బంగ్లాదేశ్తో తొలి టెస్ట్లో టీమిండియా విజయం దిశగా సాగుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు విజయానికి 4 వికెట్ల దూరంలో నిలిచింది. 513 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. 6 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసి, విజయానికి 241 పరుగుల దూరంలో ఉంది.
ఓపెనర్ జకీర్ హసన్ (100) సెంచరీతో కదం తొక్కగా.. మరో ఓపెనర్ నజ్ముల్ హొస్సేన్ షాంటె (67) అర్ధసెంచరీతో రాణించాడు. యాసిర్ అలీ (5), లిటన్ దాస్ (19), ముష్ఫికర్ రహీం (23), నురుల్ హసన్ (3) నిరాశ పరిచారు. ఆట ముగిసే సమయానికి షకీబ్ అల్ హసన్ (40), మెహిదీ హసన్ మిరాజ్ (9) క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3 వికెట్లతో రాణించగా.. ఉమేశ్, అశ్విన్, కుల్దీప్ తలో వికెట్ పడగొట్టారు.
కాగా, తొలి ఇన్నింగ్స్లో 254 పరుగుల ఆధిక్యం అందుకున్న భారత్.. రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. శుభ్మన్ గిల్ (110), పుజారా (102 నాటౌట్) సెంచరీలతో రాణించారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 404 పరుగులకే ఆలౌట్ కాగా, బంగ్లాదేశ్ 150 పరుగులకే చాపచుట్టేసిన విషయం తెలిసిందే.
సంబంధిత వార్తలు