ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భారత జట్టు ప్రయాణం ముగిసిపోయింది. ఆస్ట్రేలియాతో ఆదివారం తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత్ ఓటమి పాలైంది. లండన్లో లార్డ్స్ వేదికగా టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అర్ద శతకం (56)తో అదరగొట్టగా.. ఓపెనర్లు స్మృతి మంధాన (38), షఫాలీ వర్మ (34) రాణించారు.
వన్డౌన్లో వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ 34 పరుగులు చేసింది. అయితే, ఆఖరి ఓవర్లో ఆమె రిటైర్డ్ అవుట్గా వెనుదిరగగా.. రిచా ఘోష్ ఆమె స్థానంలో వచ్చింది. అయితే, రిచా ఒక్క పరుగే చేయగా.. దీప్తి శర్మ నాలుగు పరుగలతో అజేయంగా నిలిచింది.
ఆస్ట్రేలియా బౌలర్లలో కెప్టెన్ సోఫీ మోలినెక్స్ రెండు వికెట్లు దక్కించుకుంది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్కు ఆదిలోనే రేణుకా సింగ్ షాకిచ్చింది. ఓపెనర్ జార్జియా వోల్ (4)ను స్వల్ప స్కోరుకే వెనక్కి పంపింది. అయితే, బెత్ మూనీ (22), ఫోబీ లిచిఫీల్డ్ (22) నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపారు. అయితే, ఎలిస్ పెర్రి (56), ఆష్లే గార్డ్నర్ (53 నాటౌట్) అద్భుత అర్ధ శతకాలతో దుమ్మురేపారు.
ఈ క్రమంలో 19 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసి ఆసీస్ జయభేరి మోగించింది. తమతో పాటు గ్రూప్-ఎ నుంచి సౌతాఫ్రికాను సెమీస్కు తీసుకువెళ్లింది. ఇక ఆసీస్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైన భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
సంక్షిప్త స్కోర్లు
భారత్- 170-4(20)
ఆస్ట్రేలియా- 172/4(19)
ఫలితం- ఆరు వికెట్ల తేడాతో భారత్పై ఆస్ట్రేలియా విజయం


