
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) పురుషుల టీ20 ర్యాంకింగ్స్ బుధవారం విడుదలయ్యాయి. తాజా ర్యాంకింగ్స్లో భారత స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఆల్రౌండర్ల విభాగంలో తన నంబర్వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. హార్దిక్ 252 పాయింట్లతో టాప్ ర్యాంక్లో కొనసాగుతున్నాడు.
బౌలింగ్ విభాగంలో భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) తన రెండో ర్యాంక్ను కోల్పోయాడు. వరుణ్ ఒక స్థానం పడిపోయి 706 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు. నాలుగు స్థానాలు ఎగబాకిన న్యూజిలాండ్ పేసర్ జేకబ్ డఫీ నంబర్వన్ ర్యాంక్ను అందుకున్నాడు.
క్రితంసారి వరకు నంబర్వన్ స్థానంలో ఉన్న అకీల్ హోసీన్ (వెస్టిండీస్) రెండో ర్యాంక్కు పడిపోయాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారత ప్లేయర్లు అభిషేక్ శర్మ రెండో స్థానంలో, తిలక్ వర్మ నాలుగో స్థానంలో, సూర్యకుమార్ యాదవ్ ఐదో స్థానంలో ఉన్నారు.
రాజస్తాన్ రాయల్స్ సారథిగా సామ్సన్
బెంగళూరు: గాయం కారణంగా సారథిగా కాకుండా కేవలం ప్లేయర్గా మాత్రమే ఐపీఎల్ ఆడుతున్న సంజూ సామ్సన్కు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) నుంచి అనుమతి లభించింది. వేలి గాయం పూర్తిగా మానడంతో కీపింగ్ చేయొచ్చని బీసీసీఐ వెల్లడించింది.
తాజా సీజన్ తొలి మూడు మ్యాచ్ల్లో సామ్సన్ ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దిగగా... అతడి స్థానంలో రియాన్ పరాగ్ జట్టుకు సారథిగా వ్యవహరించాడు. ఇంగ్లండ్తో టీ20 సిరీస్ సందర్భంగా ఆర్చర్ బౌలింగ్లో సామ్సన్... కుడిచేయి బొటనవేలికి గాయం కాగా... శస్త్రచికిత్స చేయించుకున్నాడు.
దిగ్వేశ్కు జరిమానా
లక్నో: లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేశ్ సింగ్ రాఠిపై జరిమానా పడింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా... వికెట్ తీసిన అనంతరం అతిగా సంబరాలు చేసుకున్నందుకు గానూ దిగ్వేశ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు. దిగ్వేశ్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్ చివరి బంతికి పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య ఔటయ్యాడు.
ఆ సమయంలో బ్యాటర్ దగ్గరకు వెళ్లిన దిగ్వేశ్... అతడి వికెట్ తన ఖాతాలో పడినట్లు పుస్తకంలో రాస్తున్నట్లు సంబరాలు చేసుకున్నాడు. అదే సమయంలో ఫీల్డ్ అంపైర్లు దిగ్వేశ్ను వారించగా... నిబంధనలను అతిక్రమించినందుకు రిఫరీ అతడిపై జరిమానా వేయడంతో పాటు ఒక డీ మెరిట్ పాయింట్ కేటాయించారు.
‘దిగ్వేశ్ లెవల్–1 తప్పిదానికి పాల్పడ్డాడు. నియమావళిలోని 2.5 ఆర్టికల్ ప్రకారం అతడికి జరిమానా విధించాం’ అని ఐపీఎల్ పాలక మండలి ఒక ప్రకటనలో తెలిపింది. గతంలో వెస్టిండీస్ పేసర్ కెస్రిక్ విలియమ్స్ ఈ తరహా సంబరాలతో ‘ఫేమస్’ అయ్యాడు.
టీమిండియాతో ద్వైపాక్షిక సిరీస్ సందర్భంగా వికెట్ తీసిన అనంతరం ‘నోట్బుక్’లో ఏదో రాస్తున్నట్లు సైగలు చేస్తూ సంబరాలు చేసుకోగా... దానికి భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన దూకుడైన ఆటతో దీటుగా బదులిచ్చి అచ్చం అదే తరహాలో సంబరాలు చేసుకున్నాడు. కాగా... లక్నో, పంజాబ్ జట్ల మధ్య జరిగిన పోరులో పంజాబ్ కింగ్స్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.