మహాత్ముడికి నివాళిగా ఐసీసీ ఆలోచన
జొహన్నెస్బర్గ్: 2027 వన్డే ప్రపంచకప్ ప్రారంభోత్సవ తేదీ విషయంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆసక్తికర ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. ఇప్పటి వరకు పూర్తి షెడ్యూల్తో తేదీలను ఖరారు చేయని ఐసీసీ తొలి మ్యాచ్ విషయంలో మాత్రం స్పష్టంగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వన్డే వరల్డ్ కప్ను మహాత్మా గాంధీ జయంతి రోజున (అక్టోబర్ 2) ప్రారంభిస్తే బాగుంటుందని సూచన రావడంతో ఐసీసీ, దక్షిణాఫ్రికా బోర్డు సానుకూలంగా స్పందించాయి. శాంతి, అహింసలతో స్వాతంత్య్ర పోరాటాన్ని నడిపించిన గాందీపై దక్షిణాఫ్రికాలో కూడా అపార గౌరవం ఉంది.
భారత్కు రాక ముందు ఆయన 21 ఏళ్లు దక్షిణాఫ్రికాలో ఉన్నారు. భారత జాతిపిత జయంతి రోజున వరల్డ్ కప్లాంటి మెగా టోర్నీని మొదలు పెట్టి ఆయన ఘనతను గుర్తు చేయడం బాగుంటుందనే చర్చ ఐసీసీలో సాగుతోంది. వామప్ మ్యాచ్లను ముందుకు జరిపి అక్టోబర్ 2న టోర్నీ మొదలైతే ఫైనల్ నవంబర్ 21న నిర్వహిస్తారు. దక్షిణాఫ్రికాలో నల్ల జాతీయుల తరఫున పోరాడిన నెల్సన్ మండేలాతో కలిపి ఇప్పటికే భారత్, దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ను ‘గాందీ–మండేలా ట్రోఫీ’ పేరుతో నిర్వహిస్తున్నారు.


