
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో రవిశాస్త్రి (ఫైల్ ఫొటో)
ముంబై: క్రీడల్లో టెక్నాలజీ కారణంగా ఎన్నో మార్పులు వచ్చాయని టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. వాటిని సమర్థంగా వాడుకోవడం ఆటగాళ్ల చేతుల్లో ఉందని అభిప్రాయ పడ్డాడు. తాను ఆడిన రోజులతో పోలిస్తే ఇప్పుడు అత్యంత అధునాతన సాంకేతికత అందుబాటులో ఉందని.. ఇది ఆటగాళ్ల పనిని మరింత సులువు చేసిందని అతడు తెలిపాడు.
కిట్ బ్యాగ్లో బ్యాట్, ప్యాడ్లు ఉన్నట్లే
నగరంలో జరుగుతున్న వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్)లో భాగంగా ‘ఇంటర్సెక్షన్ ఆఫ్ స్పోర్ట్స్, టెక్నాలజీ ఆంటర్ప్రెన్యూర్షిప్ అండ్ మీడియా’ అనే అంశంపై కామెంటేటర్ రవిశాస్త్రి మాట్లాడాడు.
‘గత 40–45 ఏళ్లలో ఆటలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ పురోగతిని నేను దగ్గరి నుంచి చూశాను. కిట్ బ్యాగ్లో బ్యాట్, ప్యాడ్లు ఉన్నట్లే మీడియా, టెక్నాలజీ కూడా కిట్ బ్యాగ్లో భాగంగా మారింది.
అదొక హెల్మెట్లాంటిది.. సరిగ్గా వాడుకోండి
సరిగ్గా చెప్పాలంటే అది ఒక హెల్మెట్లాంటిది. దానిని సరైన రీతిలో అందిపుచ్చుకొని సమర్థంగా వాడుకోవాలి. మా రోజుల్లో రేడియో, దూరదర్శన్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు అందరికీ చేరువయ్యేందుకు ఎన్నో వేదికలు ఉన్నాయి. భారత జట్టు ఎక్కడ ఆట ఆడినా కోట్లాది మంది అభిమానులు చూస్తున్నారు. ఏఐ టెక్నాలజీ కూడా మీ కోసం, మీ టీమ్ కోసం ఎంతో ఉపయోగపడుతుంది.
సాంకేతికత ఆటను చాలా అద్భుతంగా మార్చింది. ఇప్పుడు ప్లేయర్ వెనక్కి వెళ్లి 100 సార్లు రీప్లేలు చూసుకునే అవకాశం ఉంది. మీ బలాలు, బలహీనతలే కాదు, ప్రత్యర్థుల గురించి తెలుసుకునేందుకు ఇది కీలకంగా మారిపోయింది’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.
ఇదీ చదవండి: ఇంగ్లండ్ టెస్టు జట్టులో రెండు కొత్త ముఖాలు
లండన్: టీమిండియాతో టెస్టు సిరీస్కు ముందు ఇంగ్లండ్ జట్టు యువ ఆటగాళ్లను పరీక్షించేందుకు సిద్ధమైంది. భారత్, ఇంగ్లండ్ మధ్య జూన్ 20 నుంచి ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ జరగనుంది.
దానికి ముందు సొంతగడ్డపై ఇంగ్లండ్ జట్టు... జింబాబ్వేతో ఏకైక టెస్టు ఆడనుంది. ఈ నెల 22 నుంచి నాటింగ్హామ్లో జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు శుక్రవారం 13 మందితో కూడిన జట్టను ప్రకటించింది.
ఈ మ్యాచ్ కోసం స్యామ్ కుక్, జోర్డాన్ కాక్స్ను తొలిసారి జాతీయ జట్టుకు ఎంపిక చేసింది. మీడియం పేసర్ స్యామ్ కుక్ దేశవాళీల్లో చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నాడు. 27 ఏళ్ల కుక్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో 19.77 సగటుతో 318 వికెట్లు తీశాడు.
ఇటీవల ఇంగ్లండ్ లయన్స్ తరఫున ఆస్ట్రేలియా పర్యటనలోనూ కుక్ ఆకట్టుకున్నాడు. మూడు మ్యాచ్ల్లో కలిపి 13 వికెట్లు పడగొట్టాడు. దీంతో జింబాబ్వేతో టెస్టు మ్యాచ్ కోసం అతడిని ఎంపిక చేశారు.
ఇక వికెట్ కీపర్ బ్యాటర్ అయిన 24 ఏళ్ల జోర్డాన్ కాక్స్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. మరోవైపు నాటింగ్హామ్షైర్ పేసర్ జోష్ టంగ్కు తిరిగి అవకాశం కల్పించారు. 2023 యాషెస్ సిరీస్లో ఆడిన టంగ్... ఆ తర్వాత గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యాడు. 2003 తర్వాత ఇంగ్లండ్లో జింబాబ్వే టెస్టు మ్యాచ్ ఆడనుండటం ఇదే తొలిసారి.
ఇంగ్లండ్ జట్టు:
బెన్ స్టోక్స్ (కెప్టెన్), అట్కిన్సన్, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, స్యామ్ కుక్, జోర్డాన్ కాక్స్, జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒలీ పోప్, మాథ్యూ పాట్స్, జో రూట్, జేమీ స్మిత్, జోష్ టంగ్.
చదవండి: Shubman Gill: అంపైర్తో గొడవపడి.. అభిషేక్ను కాలితో తన్ని!